ఆంధ్రప్రదేశ్
పోలీసు సిబ్బంది అనవసరంగా సివిల్ పంచాయితీల్లో తలదూరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని డిఐజి ఎం.రవిప్రకాష్

అనంతపురం పోలీసు సిబ్బంది అనవసరంగా సివిల్ పంచాయితీల్లో తలదూరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని డిఐజి ఎం.రవిప్రకాష్ హెచ్చరించారు. అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్ను శనివారం ఆయన తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ కేసుల రికార్డులను క్షుణ్నంగా పరిశీలించారు. ప్రస్తుతం రూరల్ పోలీసు స్టేషన్ పాత టూటౌన్లో కొనసాగిస్తుండటం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్న దష్ట్యా టెరిటోరియల్ జురిస్డిక్సన్లోనే రూరల్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించి జిల్లా ఎస్పీ ద్వారా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. మిస్సింగ్ కేసులు, మహిళలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు, నాటుసారా తయారీ, విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై దష్టి సారించాలన్నారు. స్టేషన్ పరిధిలో ఏ ఘటన ఏ సమయంలో జరిగినా నిర్ధేశిత సమయంలోపు స్పందన ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై దష్టి సారించాలన్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల జవాబుదారీగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ విజయభాస్కర్ గౌడ్, ఎస్ఐలు నబీరసూల్ , రమణ, చలపతి, సిబ్బంది పాల్గొన్నారు.


