
స్వయంభువుగా వెలసిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి దేవతలు ఆహ్వానితులుగా లోకకల్యాణం కోసం అంగరంగ వైభవంగా ఈ రోజు నుంచి మార్చి 7 వరకు 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
బుధవారం ఉదయం 10 గంటలకు స్వస్తి వాచనం, విష్వక్సేన ఆరాధనతో ఈ ఉత్సవాలు ఆరంభమయ్యాయి. వేదపండితుల చతుర్వేద పారాయణాలు, అర్చకుల మంత్రోచ్ఛారణ, రుత్విక్కుల ప్రబంధ పారాయణాలతో 11 రోజుల పాటు యాదాద్రి సరికొత్త శోభను సంతరించుకోనుంది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 3న స్వామివారి ఎదుర్కోళ్లు, 4న తిరుకల్యాణం, 5న దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. అత్యంత ప్రాధాన్యత కల్గిన ఈ ఉత్సవాలను తిలకించడానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. దీంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.




