
మొట్ట మొదటి సారిగా తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన చిత్రం ‘శంకరాభరణం’ ఈ సినిమా విడుదలై 40 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా బాపు రమణ అకాడమీ ఆధ్వర్యంలో ప్రసాద్ ల్యాబ్లో ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శంకరాభరణం చిత్ర ప్రదర్శన జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాతపస్వి విశ్వనాథ్ మాట్లాడుతూ.. నేను ‘శంకరాభరణం’ సినిమా ఇప్పుడు చూసి 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన అనుభూతి పొందాను. శాస్త్రీయ సంగీతం కొరవడుతున్న రోజులలో తీసిన ఈ సినిమా అందరి మన్నలను పొందటమే కాదు, అనేక మందికి సంగీతం, సాహిత్యం, నృత్యం నేర్చుకునేందుకు ఆసక్తిని కలిగించింది. సమాజానికి మంచి పని సినిమాల వల్ల అవుతుందని అంటే ఇదేనని, మనసంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు కొంత కృషి జరిగింది, అందులో నేను భాగస్వామిని కావటం ఆనందంగా ఉందని అన్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘ శంకరాభరణం, సాగర సంగమంలాంటి చిత్రాల సినీ కళామతల్లికి పుష్పాలలాంటివి. కె.విశ్వనాథ్ అనే వ్యక్తి ఒక్కరే వీటికి చిరునామా. మళ్ళీ ఇలాంటి సినిమాలు వస్తాయని ఎదురుచూసేమారికి భంగం తప్పదు. ఇలాంటి సినిమాలు రావు, తీసేవారు లేరు ’అన్నారు. విశ్వనాధ్గారి సినిమాలు మాకు పాఠాలు అని చెప్పుకొచ్చారు.
హాస్య నటుడు ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘శంకరాభరణం లాంటి సినిమాలు భవిష్యత్ దర్శకులకు ఎలాంటి సినిమాలు తీయాలో నేర్పించే సినిమా పాఠ్య గ్రంథంగా అభివర్ణించారు. సెల్ ఫోన్ లోనే సినిమాలు తీస్తున్న, చూస్తున్న ఈరోజుల్లో శంకరాభరణం ఆదర్శంగా అలాంటి చిత్రాలను తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేటి తరానికి నా సూచన అని చెప్పారు.
గేయ రచయిత సిరివెన్నేల సీతారామశాస్త్రి మాట్లాడుతూ.. ‘శంకరాభరం , సాగరసంగమం, స్వాతి ముత్యం లాంటి సినిమాలు రావటం మన అదృష్టం. కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు మనకందించిన శంకరాభరణం చిత్రం చిరస్మరణీయం. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దక్కిన మణిహారం అని ప్రశంసలతో ముంచెత్తారు.
నటుడు చంద్రమోహన్ మాట్లాడుతూ విశ్వనాధ్ గారి తో కలిసి పలు సినిమాలు చేసాను. కానీ శంకరాభరణం నాకు దివ్యానుభూతి మిగిల్చిన సినిమా . కె.విశ్వనాథ్ గారు మరి రెండు రోజుల్లో 90ల్లోకి అడుగిడుతున్నారు. ఆయన వంద పుట్టిన రోజులు జరుపుకోవాలని, ఆ రోజు. శంకరాభరణం 50 ఏళ్ళ ఫంక్షన్ కి కూడా మా అన్నయ్య రావాలని కాంక్షిస్తున్నా. అని అన్నారు.
దర్శకుడు బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ.. ఎన్ని తరాలు మారినా శంకరాభరణం తెలుగు సినిమా చరిత్రలో కలికితురాయిగా నిలుస్తుంది ’ ‘శంకరాభరణం లాంటి చిత్రాలు మళ్ళీ మళ్ళీ రావు.. ఇది తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం ఈ రోజులలో చేయాలంటే ముందుకు ప్రేక్షకులను అందుకు సిద్దం చేయాలని అన్నారు.
సినీ విశ్లేషకుడు రెంటా జయదేవ మాట్లాడుతూ తెలుగు సినిమాకి తొలిసారి జాతీయ స్థాయిలో గుర్తింపు ‘శంకరాభరణం’ తీసుకువస్తే మళ్ళీ 39 ఏళ్ళకు బాహుబలికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ మధ్యలో శంకరాభరణానికి పోటీ లేదనేందుకు ఇదే నిదర్శనం. ఎన్టీఆర్ లాంటి పెద్ద పెద్ద హీరోలు లేకుండానే , ఈ సినిమా మంచి కమర్షియల్ విజయం సాధించిందంటే అంతా విశ్వనాథ్గారి మహిమే అంటాను నేను అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డబ్బింగ్ జానకి, భీమేశ్వర్రావు, సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన వంశీ, కస్తూరి, ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వర్రావు కుమారులు ఏడిద రాజా, ఏడిద శ్రీరామ్, శీ విశ్వనాథ్, బి.వి.ఎస్.రవి, దశరథ్, రచయిత ప్రవీణ్ వర్మ, తనికెళ్ళ భరణి, అశోక్ కుమార్, అనంత్, రమేష్ ప్రసాద్, అచ్చిరెడ్డి, మాధవపెద్ది సురేష్, డాక్టర్ కె. వెంకటేశ్వరరావు. తదితరులు పాల్గొన్నారు.


