
గాంధీ పుట్టిన దేశంలో మద్యం నిషేదించాలని వస్తున్న డిమాండ్ని ప్రభుత్వాలు ఎప్పుడో గంగలోకి తొక్కాయి. మద్యపానమే నిధులకు సోపానమన్న తీరుగా దేశంలో రెండు మూడు రాష్ట్రాలు మినహా దాదాపు అన్ని రాష్ట్రాలలో మద్యం ఏరులై పారుతోంది. ఏపిలో మద్య నిషేదం అని చెపుతూనే షాపులు తగ్గించి, వచ్చే ఆదాయం మాత్రం అంతకు మించి ఉండేలా సామాన్య జనం జేబులు కొల్లగొట్టే పని జరుగుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే పంజాబ్ ప్రభుత్వం మద్యం కోసం ప్రత్యేకంగా షాపులకి వెళ్లనవసరంలేకుండా వీధి చివరన ఉండే పచారీ సామాన్ల షాపుల్లోనూ దొరికేలా అనుమతులకు గ్రీన్ సిగ్నలిచ్చేసింది.
ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే కిరాణ కొట్టులో ఉప్పు, పప్పు, సబ్బులు, టూత్ పేస్ట్ వంటి నిత్యావసరాలతో పాటు ఇక కిరాణ కొట్టులో.. ఎంచక్కా మందు బాటిళ్లు కూడా కొనొచ్చంటూ జనాలకి బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. మందు కోసం ఎక్కువగా కష్టపడకుండా, శ్రమించకుండా.. అందుబాటులో మద్యం ఉంచే ప్రయత్నాలలో భాగంగానే ఇలా ఆదేశాలిచ్చినట్టు అక్కడి అధికార గణం చెపుతుండటం విశేషం. దీంతో ఈ నిర్ణయంతో ప్రభుత్వమే భారీగా తాగండి…. నచ్చినంత ఊగండి…. ప్రభుత్వానికి ఆర్ధికంగా సహకరించండి అన్న చందంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.
ఇప్పటివరకు డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో మాత్రమే ఫారిన్ లిక్కర్ అమ్మకాలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేది. అయితే తాజాగా ప్రత్యేక మద్యం దుకాణాలతో పాటు కిరాణా షాపులలోనూ మద్యం విక్రయాలపై విధి విధానాలు నిర్నయిస్తూ ఈ మధ్య పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఫారిన్ లేదా ఇంపోర్టడ్ లిక్కర్ కిరాణ షాపుల్లోనూ అమ్మకాలు జరగనున్నాయి. ఈ మేరకు స్థానికంగా ఉన్న కిరాణ షాపుల యజమానులతో మద్యం తయారీ కంపెనీలు.. ఓ ఒప్పందం చేసుకుని వారికి కావాల్సిన సరుకు సప్లై చేసి లిక్కర్ బాటిల్స్ అమ్మకాలను ఆరంభిస్తున్నంది. ఇందుకు అనుగుణంగా కిరాణ షాపుల యజమానులకు ప్రభుత్వం ప్రత్యేకంగా L2B లైసెన్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇందుకు గానూ గతంలో రూ.10లక్షలుగా ఉండే లైసెన్స్ ఫీజుని రూ.20లక్షలుగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది..
ఈ సరికొత్త మద్యం పాలసీ 2020 ఏప్రిల్ 1 నుంచి పంజాబ్లో అమలు కానుంది. కేవలం కిరాణ షాపులే అనుకుంటే పొరపాటే ఇందులో నిత్యావసరాలతో పాటు బేకరీ , టాయ్ లెటరీస్, అందాలకు మెరుగులు దిద్దే కాస్మోటిక్స్, ఇంటి సామాగ్రి, చిన్నారు బొమ్మలు, క్రీడలకు సంబంధించిన వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఆఫీస్ స్టేషనరీ, గిఫ్ట్ ఐటెమ్స్ ఇలా అన్ని రకాలుగా ప్రజలకు ఈ స్టోర్లలో అమ్మకాలుండాలని ప్రభుత్వం తన ఉత్తర్వులలో పేర్కొనటం విశేషం.
పంజాబ్ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీపై . మహిళలు మండిపడుతున్నా, అక్కడి మందుబాబుబు మాత్రం ఖుషీగా ఉన్నారనిపిస్తోంది.




