Allఆంధ్రప్రదేశ్
మరో 12 దిశ పోలీస్స్టేషన్ల ప్రారంభం

మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మరో 12 దిశ పోలీస్స్టేషన్లను ప్రారంభిస్తున్నామని ఎపి డిజిపి గౌతం సవాంగ్ చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, దిశ-2019 చారిత్రాత్మక బిల్లును ఎపి శాసనసభ ఆమోదించిందని.. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినట్టు వివరించారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా దిశా చట్టానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. ఆరు జిల్లాల్లో ‘దిశ’ పోలీస్ స్టేషన్లు ప్రారంభించామని, అలాగే ‘దిశ’ చట్టం అమలులో భాగంగా 13 జిల్లాల్లో ప్రత్యేక కోర్టులతో పాటు విశాఖ, తిరుపతిలో ‘దిశ’ ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ వెల్లడించారు.
‘దిశ’ ఎస్ఓఎస్ యాప్ అందరికీ ఉపయుక్తంగా ఉందని. ఇప్పటి వరకు ‘దిశ యాప్’ ను రెండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. 14 వేల కాల్స్ వచ్చాయన్నారు. స్పందనలో 52 శాతం మహిళలు ఫిర్యాదు ఇవ్వడం మార్పుకు నిదర్శనమన్నారు. కేవలం 25 రోజుల్లో 86 వచ్చిన క్రియాశీలక కాల్స్ లో26 కేసుల్లో ఎఫ్ఐఆర్ లు నమోదు చేసామని, భర్త వేధింపులు,ఈవ్ టీజింగ్ మెసేజ్ లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 206 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయన్నారు. సైబర్ మిత్రకు ‘9121211100’ వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని డీజీపీ పేర్కొన్నారు. నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు సైబర్ మిత్రా ఏర్పాటు చేశామని చెప్పారు.



