Allజాతీయ వార్తలు

ఎస్‌సి, ఎస్‌టి వేధింపుల నిరోధక సవరణ చట్టం-2018 రాజ్యాంగబద్ధమే



కేంద్రం తీసుకువ‌చ్చిన ఎస్‌సి, ఎస్‌టి వేధింపుల నిరోధక సవరణ చట్టం-2018 రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు త‌న తీర్పులో స్పష్టంచేయ‌టంపై దేశ వ్యాప్తంగా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ఎస్‌సి, ఎస్‌టి వేధింపుల నిరోధక చట్టం యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. ఎస్‌సి, ఎస్‌టి చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడానికి ముందు దర్యాప్తు అవసరం లేదని అలాగే, అరెస్టుకు సీనియర్‌ పోలీసు అధికారుల నుంచి అనుమతి పొందవలసిన అవసరం లేదని తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. 

జస్టిస్‌ అర్జున్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఎస్‌సి, ఎస్‌టి సవరణ చట్టం-2018 చట్టబద్ధతను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జ‌రిపింది. దళిత, ప్రగతిశీల శక్తుల ఒత్తిడికి తలొగ్గి కేంద్రప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి వేధింపుల నిరోధక సవరణ చట్టం-2018ని తీసుకొచ్చిందని, సవరణ చట్టం.. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వ హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషన్‌ వేసిన పృథ్వీరాజ్‌ చౌహాన్ వాదించ‌గా, ఈ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలుచేస్తోంద‌ని ఈ త‌ర‌హా కేసులు వేసిన న్యాయ‌వాదులు త‌మ వాద‌న‌ల‌ను వినిపించారు. అయితే ఎస్సీ, ఎస్టీలపై వివక్ష కొనసాగుతున్నదని, నిబంధనలు సడలించలేమంటూ ఈ కేసులో కేంద్రం వివరణ ఇచ్చింది.

అనంత‌రం త‌న తీర్పును వెల‌వ‌రిస్తూ…. ఎస్‌సి, ఎస్‌టి వేధింపుల నిరోధక చట్టం యథాతథంగా కొనసాగుతుందని స్ప‌ష్టం చేసింది. ఎస్‌సి, ఎస్‌టి వేధింపుల నిరోధక చట్టం కింద అభియోగాల్లో ప్రాథమిక ఆధారాలు లేనిపక్షంలో కోర్టులు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయవచ్చునని తెలిపింది. 

ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు చట్టంలోని పలు నిబంధనల్ని సడలిస్తూ 2018 మార్చి 20న తీర్పు వెల్ల‌డించ‌గా చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంద‌ని, దేశవ్యాప్తంగా తీర్పుపై నిరసనలు వెల్లువెత్తిన నేప‌ధ్యంలో తీర్పును పున‌ర్‌ సమీక్ష కోరుతూ కేంద్రం సుప్రీంను ఆశ్రయించ‌గా మార్చి 20 నాటి మార్గదర్శకాలని నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీచేసిన విష‌యం విదిత‌మే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker