
బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్ కుటుంబం దోచుకుతింటున్నదని టిఆర్ ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ సమయం సందర్భం లేకుండా మాట్లాడకూడదనే ఉద్దేశంతో ఇప్పటి వరకు మౌనంగా ఉన్నానని , కానీ టిఆర్ ఎస్ నేతలు చేస్తున్న స్వార్థ రాజకీయాలు సహించలేకపోతున్నానని అన్నారు.
తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను డీఎస్ ఖండిస్తూ, తండ్రి, కొడుకు, కూతురు బాగుపడితే బంగారు తెలంగాణ అయినట్లా? అని కేసీఆర్ను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు తాను ఏం చేశానని తనను ప్రశ్నిస్తున్న వారు ముందుగా వాళ్లు ఏం చేశారో చెప్పాలని డిఎస్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీని వీడి చరిత్రాత్మక తప్పిదం చేశానని.. ఇది చారిత్రిక తప్పిదమేనని అంగీకరించారు. అప్పట్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్ తో సరిపడని కారణంగానే కాంగ్రెస్ పార్టీ వీడాల్సి వచ్చిందని వివరించారు. కొంత మంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేకున్నా నా సస్పెన్షన్ తీర్మానంపై సంతకాలు చేశారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కేసీఆర్కు దమ్ముంటే తన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిఎస్ సవాల్ విసిరారు.




