Allఆంధ్రప్రదేశ్
కొత్త పొత్తుల శక్తి ఎంత.?

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని పెద్దల మద్దతుతోనే రాజధాని మార్చుతున్నట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. కేంద్రానికి చెప్పకుండా ఏమీ చేయడం లేదని వైసీపీ అంటోందని గుర్తుచేశారు. అసలు రాజధాని మార్పుకు మద్దతిస్తున్నారో లేదో కేంద్రం తేల్చేయాలని కోరారు. బీజేపీ పెద్దన్న పాత్ర ఎటువైపో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని నిలదీశారు. రాష్ట్రానికి న్యాయం చేయగలిగే స్థాయిలో బీజేపీ ఉందన్నారు. బీజేపీ తలచుకుంటే రాజధాని అమరావతి సమస్య వారికి అతి చిన్నదన్నారు. ఈ విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి న్యాయం చేయాలని పయ్యావుల డిమాండ్ చేశారు.
అమరావతిపై బీజేపీ నిర్ణయం బట్టే ఆంధ్రప్రదేశ్లో వారి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం తలచుకుంటే రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావం చూపగలదో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో ఇటీవలే చూశామన్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎవరి శక్తి ఎంతమేరో వారికి తెలుసని గుర్తుచేశారు. ఏపీ రాజధాని అంశంలో బీజేపీ-జనసేన ఎలా ముందుకెళ్తాయోనని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. కొత్త పొత్తుల శక్తి ఎంత అనేది భవిష్యత్లో తెలుస్తుందన్నారు. జనసేన-బీజేపీ పొత్తుతో అంతిమంగా రాష్ట్రానికి మేలు జరగాలని ప్రజలు ఆశిస్తున్నారని పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు




