Allఆంధ్రప్రదేశ్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన అమరావతి మహిళలు

రాజధాని అమరావతిలోనే ఉంటుందని, రాజధాని మార్పు జరగదని ఏపీ రాజధాని అమరావతి మహిళలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం అమరావతి నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లిన మహిళలు, రైతులు సికింద్రాబాద్ లోని కిషన్ రెడ్డి కార్యాలయానికి వచ్చి ఆతనిని కలుసుకుని, గతంలో జగన్ రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చి, ఎన్నికల తదుపరి మాటమారుస్తు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని, గత కొన్ని వారాలుగా అమరావతిలో రైతులు, వారి కుటుంబసభ్యులు ఆందోళనలు చేపడుతున్నా ఏపి ప్రభుత్వం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా మహిళలు కన్నీళ్ల పర్యంతమై మూడు పంటలు పండే భూములను రాష్ట్ర భవిష్యత్ కోసం తాము ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం తమని పెయిడ్ ఆర్టీస్టులంటూ అరెస్టు చేయిస్తోందని, మీచావు మీరు చావండంటూ మంత్రులు మాట్లాడుతున్నారని రాజధానిపై నెలకొన్న పరిణామాలను కిషన్ రెడ్డికి వివరించి, తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఏపీ రాజధాని మార్పు కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ,
రాజకీయ పార్టీలు..ప్రభుత్వం సమన్వయంతో చర్చించి సమస్య పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తాను రైతులకు సాయం చేస్తానని..వారికి అండగా నిలుస్తానంటూ మంత్రి హామీ ఇచ్చారు. అమరావతిలోనే రాజధాని కొనసాగేలా ప్రయత్నం చేస్తానంటూ కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాజధాని మార్పు అంత ఈజీ కాదని, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పి శాంతపరిచారు.




