Allఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు
తెలంగాణ ఉద్యమ స్పూర్తితో రాయలసీమ
నీళ్లు నియామకాలు నిధులు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా మారి స్వరాష్ట్రాన్ని సాధించగా… ఇదే అంశాలపై రాయలసీమ ప్రాంత నేతులు కూడా పోరాటాలకు సిద్దమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన రాజధాని కర్నూలులో పెట్టాల్సిందే… లేదంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండని వైసిపి మాజీ నేత మైసూరారెడ్డి డిమాండ్ చేస్తూ, పలువురు నేతలను కలిసే పనిలో పడ్డారు.
ఇప్పటికే రాయలసీమకు రాజధాని కోసం నేతలు, సంఘాలతో కలిసి పనిచేస్తామని, క్యాబినెట్ నిర్ణయం తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తామని మైసూరా స్పష్టంచేశారు. మా ప్రాంతానికి నీళ్లు ఇవ్వరు, నిధులు ఇవ్వరు, రాజధాని ఇవ్వరు ఇంకా ఎందుకు మీతో కలిసి ఉండాల్సిన అవసరం మాకేముందని మైసూరా రెడ్డి మండిపడ్డారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేశాం. హైదరాబాద్ రాజధానిని చేస్తే ఊరుకున్నా, ఇప్పుడు ఇలాంటివి కుదరవని స్పష్టం చేసారాయన.
గతంలో అమరావతి లో ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు సేకరించి నప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వ పెద్దలే ఆరోపిస్తున్నారని, ఇప్పుడు వైజాగ్ ని రాజధానిగా మార్చే క్రమంలోనూ అధికార పెద్దలు ఇన్సైడ్ ట్రేడింగ్ జరుపుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో రాజధాని పెడితే రాయలసీమ ప్రజలకు అందుబాటులో ఉండదని మైసూరా రెడ్డి వివరించారు. ప్రభుత్వ భూములు ఉన్న రాయలసీమను వదిలేసి వేరే చోట రాజధాని ఎందుకు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఇద్దరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే అయినా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని, హైకోర్టుతో పాటు రాజధాని రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయకుంటే ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి శ్రీకారం చుడతామని మైసూరా స్పష్టం చేసారు.



