
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించినున్న నాలుగవ సినిమాపై కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. `మిస్టర్ మజ్ను` ప్లాప్ తో మరోసారి డైలమాలో పడటంతో అఖిల్ తీసుకునే తెలివైన నిర్ణయం కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. సక్సెస్ లో ఉన్న కొరటాల శివ, సుకుమార్ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్లంతా బిజీగా ఉన్నారు. అఖిల్ తో సినిమా చేసేంత టైమ్ లేదు. కొత్త దర్శకులతో రిస్క్ తీసుకోలేని సన్నివేశం ఉంది. ఈ నేపథ్యంలో అఖిల్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు? ఎలాంటి కథ ఎంపిక చేసుకుంటాడు? వంటి సందేహాలు ఉన్నాయి. ఇప్పటికే కొంత మంది దర్శకుల పేర్లు కూడా వినిపించాయి.
శ్రీనువైట్ల, బొమ్మరిల్లు భాస్కర్, పరశురాం పేర్లు ప్రధానంగా చర్చకొచ్చాయి. ప్లాపుల్లో ఉన్నా శ్రీను వైట్లకి ఛాన్స్ ఇస్తాడా? అంటే.. సీనియారిటీని గౌరవించి.. నాగ్ తో ఉన్న స్నేహం కారంణంగా ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని వినిపించింది. అయితే శ్రీనువైట్ల కంటే.. పరశురాం, భాస్కర్ పేర్లు ఆసక్తిగా తెరపైకి వస్తున్నాయి. ఆ ఇద్దరూ గీతా ఆర్ట్స్లో అఖిల్ తో సినిమా ప్లాన్ చేశారన్న ప్రచారం సాగుతోంది. పరుశురాం, భాస్కర్ మధ్య పోటీ లో ఫైనల్ గా ఎవరి కథ ఓకే అవుతుందో సస్పెన్స్. అయితే చివరిగా అఖిల్.. బొమ్మరిల్లు భాస్కర్ కే ఓకే చెప్పాడని మెగా కాంపౌండ్ వర్గాల నుంచి లీకైంది. అఖిల్ కు ఓ డిఫరెంట్ లవ్స్టోరీ చెప్పి ఒప్పించాడని ఫిలింనగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. గీతా ఆర్స్ట్ స్టోరీ లాక్ చేసిందని సమాచారం. భాస్కర్ గతంలో `పరుగు`, `ఆరెంజ్`, `ఒగోలు గిత్త` సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే.



