
మరోమారు బుల్లి తెర ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు అమృతం వచ్చేస్తున్నాడు. లైట్ బాక్స్ మీడియా అధినేత గుణ్ణం గంగరాజు , జి 5 మీడియాతో కలిసి ఈ అమృతం ద్వితీయం నిర్మిస్తున్నారు. ఆంజనేయులు, అమృత రావు అనే ఇద్దరు స్నేహితులు కలిసి తమ రెస్టారెంట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేక్రమంలో విన్నూత్న ఐడియాలతో 2001 లో ఆరంభమైన అమృతం బుల్లి తెర వీక్షకులకు హాస్యాన్ని పంచి పెట్టింది. అమృతం పాత్రలో శివాజీ రాజా, నరేష్, హర్ష వర్ధన్ లు నటించగా, గుండు హనుమంత రావు అంజిగా ముఖ్య పాత్ర చేసారు. వాసు ఇంటూరి, సర్వం అనే నమ్మకస్తుడైన పనివాడి పాత్ర పోషించగా, శివ నారాయణ హింసించే ఇంటి ఓనర్ అప్పాజీ పాత్రలో నటించారు. సిట్ కామ్ గా ప్రారంభమై, అనుకోని సంఘటనలు, సందర్భాలు పలకరించడం వెనుక హాస్యాన్ని వెదజల్లుతూ వీక్లీ సీరియల్ గా ఆరు సంవత్సరాలపాటు బుల్లి తెర పై నవ్వులు కురిపించాడు అమృతం.
తిరిగి పదమూడు సంవత్సరాల తరువాత మళ్ళి ప్రేక్షకులను కవ్వించి కడుపుబ్బా నవ్వించడానికి సిద్దమయ్యాడు . అమృతం సీరియల్కి కొనసాగింపుగా వస్తున్న ఈ అమృతం ద్వితీయం లో హర్షవర్ధన్, శివ నారాయణ, వాసు ఇంటూరి, రాగిణి పూర్వ పాత్రలే పోషించగా, అంజి పాత్రలో ఎల్బి శ్రీరామ్ సత్య క్రిష్ణ అమృతం భార్య సంజీవిని పాత్రలో కనబడనున్నారు. కాశీ విశ్వనాథ్ తో పాటు రాఘవ కీలకమైన పాత్రలు పోషించారు. ఈ ఉగాది నుంచి మీ జి5లో ఈ అమృతం ద్వితీయం సందడి చేయబోతోంది.




