Allఆంధ్రప్రదేశ్
పోలాకి జడ్పిటిసి కి మంత్రి ధర్మాన కృష్ణదాస్ తనయుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య

పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపవద్దని వైఎస్సార్సీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నా శ్రీకాకుళం జిల్లా ధర్మాన కుటుంబానికి ఇవి వర్తించేలా కనిపించడంలేదు. స్థానికంగా చాలా మంది స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి సిద్దమైనా పోలాకి జడ్పిటిసి వైస్సార్సీపీ యువ నాయకుడు, మంత్రి ధర్మాన కృష్ణదాస్ తనయుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య నామినేషన్ దాఖలు చేయటం ఆ పార్టీలోనే రచ్చకు దారి తీసే పరిస్థితి నెలకొంది. బైటకు మౌనంగా కనిపిస్తున్నా పదవులన్నీ సొంత వారికేనా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. కృష్ణ చైతన్య సోదరుడు ధర్మాన రామలింగ నాయుడు, ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, డోల జగన్ తదితరులతో కలిసి జడ్పీ సీఈవో చక్రధర బాబు ఎదుట నామినేషన్ దాఖలు చేసిన క్రమంలో వైసిపి వర్గాలలో ఆశావహులు మౌనంగా రోదిస్తున్నారని పార్టీ వర్గాలే చెపుతున్న మాట.
అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన కృష్ణ చైతన్య మాత్రం వీలైనంత ఎక్కువ మందికి ప్రజా సేవ ద్వారా మేలు చేయాలని భావించే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లు పేర్కొనటం గమనార్హం. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం అన్నది సునాయాసమని, ప్రత్యర్థి ఎవరైనా ఉంటే పోటీలో ఉన్నామని పించుకోవడమే తప్ప సాధించిందేమీ లేదంటూ ప్రత్యర్ధులను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారన్నారోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి తోడు జిల్లాలో వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ద్వారా ఇంటింటికి వైసిపికి ఓట్లేయకుంటే ప్రభుత్వ పథకాలు రద్దు చేయిస్తామని ప్రచారం ఆరంభించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.



