Allఆంధ్రప్రదేశ్
పది నిమిషాల వ్యవధిలో పది జీవోలు
అర్ధరాత్రి జివోలతో ప్రజలను అల్లాడించిందంటూ గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకుని, పాదయాత్రలో ఈ అంశంపై తెగ ఆరోపణలు గుప్పించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తను అధికారంలోకి రాగానే ఇదే పంధాని అలవరుచుకోవటం విశేషం. ఇప్పటికే పలు అంశాలలో రాత్రి వేళల్లో ప్రభుత్వ ఆదేశాలు జారీ చేస్తు వస్తున్న సర్కారు తాజాగా మంగళవారం అర్ధరాత్రి పది నిమిషాల వ్యవధిలో పది జీవోలను రహస్యంగా విడుదల చేసి రికార్డు నెలకొల్పడం ఓ విశేషం.
గతంలో తను చేసిన విమర్శలను పక్కకు పెట్టిన జగన్ ప్రభుత్వం తాజాగా కీలక అంశాలపై జారీ అవుతున్న ప్రబుత్వ ఆదేశాలన్ని ఎక్కువగా అర్ధరాత్రి బైటకు వస్తుండటం అలవాటైన ప్రక్రియగా మారిపోతోందన్న వాదన వైసిపి వర్గాలలోనే వినిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న వివరాల ప్రకారం రాత్రి 11:45 గంటల నుంచి 11:55 మధ్య పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ జీవోలను విడుదల చేసింది.
59.85 శాతంగా ఉన్న రిజర్వేషన్లను హైకోర్టు ధర్మాసనం కొట్టిపారేసిన నేపథ్యంలో వాటిని 50 శాతానికి కుదిస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు వీలుగా ఆర్డినెన్స్ లేదంటే జీవోల ఇచ్చినప్పటికీ సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆస్కారం ఉందని అంతా అనుకున్న తరుణంలో అర్ధంతరంగా ఈ జివోలు విడుదల కావటమే చర్చకు దారి తీస్తోంది. మరి యాభై శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఎంత వరకు సిద్దమవుతుందో చూడాలి. కాగా ఈ పాపం మీదంటే… మీదని అధికార విపక్షాలు ఈ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసి, జనం చెవులని ఊదరగొట్టేందుకు అప్పుడే బాకాలను కూడా సిద్దం చేస్తుండటం మరోవిశేషం.




