
వరుస విజయాలతో దూసుకు పోతున్న తెలుగు తారామణి అంజలిని సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సరసన నటించే ఛాన్సు దక్కించుకుంది. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో పూర్తి యాక్షన్ ఎంటటైనర్ గా మూవీ తెరకెక్కుతున్న చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు గానూ నయనతార, శ్రియ నటిస్తారంటూ చాలా కాలంగా వినిపిస్తున్నా, కాల్షిట్ల కారణంగా ఈ సినిమాని వారిరువురూ అంగీకరించనట్టు సమాచారం.
కాగా ఈ చిత్రంలో రెండో హీరోయిన్గా ఎంపికైన తెలుగమ్మాయి అంజలిని మెయిన్ లీడ్ హీరోయిన్గా దర్శకుడు మార్చినట్టు తెలుస్తోంది. దీంతో బాలయ్య సరసన అంజలి ఇప్పటికి ఖరారైనట్లేనని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం బాలయ్య మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా రెండో హీరోయిన్ పాత్ర కోసం పలువురు యువ కథానాయికలను సంప్రదిస్తున్నట్టు సమాచారం.
ఈ మూవీలో ఒక పాత్రలో అఘోరగా కనిపించనున్న బాలయ్య ఈ పాత్ర కోసం గుండు కూడా చేయించుకుని ఈ మధ్య కనిపిస్తున్నారు. వారణాశిలో ఇందుకు సంబంధించిన షూటింగ్ చిత్రీకరించేందుకు బోయపాటి సిద్దమవుతున్నారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇప్పటికే ‘లెజండ్’, ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఉండటంతో హ్యట్రిక్ హిట్టు కొట్టేందుకు సిద్దమవుతున్నాడు.




