
గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత, ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు, నిర్మాత, కళావాహిని శ్రీమతి విజయనిర్మల 74వ జయంతి సందర్భంగా నానక్ రామ్ గూడా లోని సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల నివాసంలో ఏర్పాటు చేసిన విజయనిర్మల విగ్రహాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ నిర్మల స్త్రీ శక్తి పురస్కారాన్ని డైరెక్టర్ నందినిరెడ్డికి కృష్ణంరాజు, మహేష్ బాబు అందచేశారు.
ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన రెబెల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ – “ నన్ను ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచే విజయ నిర్మల పేరు లోనే విజయం ఉంది , నిర్మలత్వం ఉంది. అనితర సాధ్యంలా 46 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించి అందనంత ఎత్తుకి ఎదిగిన ఆమె మరిన్ని విజయాలు సాధిస్తుందని అనుకున్న దశలో ఆమె దివికేగిందంటూ తన నివాళులర్పించారు. ప్రతి ఒక్కరికి తల్లితండ్రులు అంటే అభిమానం ఉంటుంది. కానీ నరేష్ తన తల్లికి బంగారు పాదాలు చేయించి పూజించడం గొప్ప విషయం” అన్నారు.
విజయ నిర్మల స్త్రీ శక్తి అవార్డ్ గ్రహీత, దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ ‘‘విజయనిర్మల గారి పేరు మీద విజయ నిర్మల స్త్రీ శక్తి అవార్డు మొదటి సంవత్సరం నేను తీసుకోవడం చాలా ఆనందంగా వుందని అన్నారు.
హీరో నరేష్ విజయకృష్ణ మాట్లాడుతూ : ‘‘మా అమ్మ కృష్ణ గారు ఒక రోల్ మోడల్గా నిలిచారు. ఓటమి ఎదురైనప్పుడు ఇద్దరూ ఇచ్చిన ధైర్యం అంతా ఇంత కాదు. నటీనటుల సంక్షేమం కోరుకునే అమ్మ బాటలో నడుస్తున్నా, మా వెల్ఫేర్ కోసం నేను ఎప్పుడూ ముందు వుంటాను. నటీ నటులకు ప్రతి ఏటా అమ్మ పేర విజయ నిర్మల స్త్రీ శక్తి అవార్డు అందించనున్నాం’’ అన్నారు
సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ – “ నా సినిమాలు రిలీజ్ అవ్వగానే ఫస్ట్ నాన్నగారు మార్నింగ్ షోనే చూసి సినిమాలో విశేషాలు, లోటుపాట్లు చెప్పేవారు. తరువాత విజయనిర్మల గారు మాట్లాడి కంగ్రాట్స్ చెప్పేవారు. వన్ ఆఫ్ మోస్ట్ గ్రేటెస్ట్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ ఎవర్ ఆమె. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ రోజన ఆమె లోటు నాకు స్పష్టంగా కనిపించింది. ఈరోజు మనందరం ఆవిడను మిస్ అవుతున్నాం అన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ – “విజయనిర్మల కేవలం ఐదారు సినిమాలలో నటించి నేను దర్శకత్వం చేస్తా అంటూ ఉండేది . ఇప్పుడే తొందరపడి డైరెక్ట్ చేయద్దు, ఒక వంద సినిమాలలో నటించి డైరెక్టర్ అవ్వు అని సలహా ఇచ్చా. అలా వంద సినిమాలు అయిపోయిన తరువాత డైరెక్టర్గా మారిపోయింది. మొట్టమొదటి సినిమా బడ్జెట్ తక్కువలో అవుతుందని మలయాళంలో `కవిత` అనే సినిమా చేసింది. అది అద్భుతమైన విజయం సాధించడంతో తెలుగులో `మీనా` సినిమా చేసింది. అదికూడా సూపర్ హిట్ అయింది. ఆపై వెనక్కి తిరిగి చూడాల్సిన పనే లేకపోయింది. ఏకంగా 46 సినిమాలు తను తీస్తే అందులో 95 శాతం హిట్ సినిమాలే అంటే ఆమె ప్రతిభ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. అంత గొప్ప దర్శకురాలు నా భార్య కావడం నా అదృష్టం” అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి మురళి మోహన్ , పరుచూరి గోపాలకృష్ణ , ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణా రెడ్డి , నమ్రత, అచ్చిరెడ్డి, రేలంగి నర్సింహా రావు, గల్లా జయదేవ్, పివిపి, సుధీర్ బాబు, ఆదిశేషగిరరావు, శివకృష్ణ, మారుతి, బ్రహ్మాజీ, శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.




