Allఆంధ్రప్రదేశ్
జాతిపిత బొమ్మలు ఉండాల్సిన చోట 420ల ఫొటోలా..

జాతిపిత బొమ్మలు ఉండాల్సిన చోట 420ల ఫొటోలు పెడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. గురువారం ఆయన మైలవరం టౌన్ లో 2వ రోజు ప్రజా చైతన్య యాత్ర లో ఆయన పాల్గొని, పలు చోట్ల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, సొంత బావమరిది భూములు తీసుకోలేక అసైన్డ్ భూములు లాక్కొంటున్నబూతుల మంత్రి, రైతాంగానికి తగిన ధాన్యం డబ్బులు ఇప్పించలేరు కానీ ఢిల్లీ వెళ్లి ప్రగల్బాలు పలుకుతున్నాడని ఎద్దువా చేసారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగి పోవటానికి ఇక్కడ అమలవుతున్న జే టాక్స్ కారణమని, ఈ టాక్స్ పేరుతో వేల కోట్లు జగనన్న తన జేబు నింపుకుంటున్నాడని అన్నారు.
ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతానంటూ బీరాలు పలికిప జగన్ ఇప్పుడు తానే కేంద్రం ముందు ఒంగిపోయాడని , సాష్టాంగ పడుతున్నాడని విమర్శించారు. కేవలం 9నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత మూటగట్టుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ మాత్రమేనని అన్నారు.
ఇటీవల రస్ అల్ ఖైమా భారత ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం వెలుగు చూసిందని, ఇది వాస్తవమేనని కేంద్రం కూడా నిర్ధారించిన తరుణంలో పెద్ద ఎత్తున సొమ్ములు నొక్కేసిన జగన్ తనను తాను రక్షించుకునేందుకు ఢిల్లీ వెళ్తున్నారు మినహా జనం కోసం కాదని అన్నారు. నిమ్మగడ్డ వాగ్మూలంతో ఈ కేసులో తను ఎక్కడ ఇరుక్కుంటానోనని సీఎం జగన్ వణికిపోతున్నారన్నారు. తనని రక్షించాలని కేంద్రం ముందు రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి మోకరిల్లాడని ఎద్దేవా చేసారు.
జగన్ చేతగాని పాలనపై అన్ని వర్గాల ప్రజలు విరక్తి చెందారని, సామాన్య మధ్య తరగతి పేద ప్రజలు నష్టపోయి దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైలవరం లో రాజకీయ వ్యభిచారులు అవకాశవాదులు బాగానే ఉన్నారని అందినది దోచుకుతింటున్నారని స్థానికి వైసిపి నేతలకు చురకలంటించారు దేవినేని.



