మార్పును పట్టుకుందాం.. విద్యా దీవెన నిధులు విడుదల చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

2022 ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి రూ.694 కోట్లు జమ.. 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
విద్యతోనే తల రాత మార్చగలమని ఆ దిశగా అడుగులు
విప్లవాత్మక మార్పులతో పేద పిల్లల ఉన్నత విద్యకు బాటలు
ప్రతి ఇంటి నుంచి ఇంజనీరో, డాక్టరో, కలెక్టరో రావాలన్నదే లక్ష్యం
పిల్లల భవిష్యత్ కోసం మూడేళ్లలో విద్యపై రూ.53 వేల కోట్లు ఖర్చు
గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి ఇవాళ 17–22 ఏళ్ల పిల్లలు రాబోయే సవాళ్లను ఎదుర్కొంటూ ఈ ప్రపంచంలో కనీసం మరో 80 సంవత్సరాలు సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలి. పదేళ్ల క్రితం మన దేశం, మన కుటుంబం, మనం ఎలాంటి ప్రపంచాన్ని చూశామో చెప్పగలం. అయితే 20 ఏళ్ల తర్వాత ఎలాగుంటుందో చెప్పలేనంత వేగంగా మార్పులు జరుగుతున్నాయి. అంతే వేగంతో ప్రయాణం చేయకపోతే మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడలేరు. అలా పోటీ పడాలంటే ప్రతి అడుగులోనూ మార్పు కనిపించాలి. అందుకు ప్రభుత్వ పరంగా తగిన వాతావరణం ఏర్పాటు చేయాలి. ఈ మూడేళ్లుగా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం.
చిరునవ్వుతో బకాయిలు చెల్లించాం ,గత ప్రభుత్వం దిగిపోయే ముందు ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 2017–18, 2018–19కి సంబంధించి రూ.1,778 కోట్లు మన ప్రభుత్వం పిల్లల కోసం చిరునవ్వుతో చెల్లించింది. ఇందులో భాగంగా ఈ కాలేజీకి (ప్రస్తుతం సభ జరుగుతున్న) కూడా రూ.14 కోట్లు బకాయిలు చెల్లించాం.
. పిల్లల గురించి, వారి చదువుల గురించి అంతలా ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇది. ఒక్క జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు సంబంధించి మాత్రమే ఈ మూడేళ్లలో రూ.11,715 కోట్లు అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. జగనన్న వసతి దీవెన కింద ఎంత మంది పిల్లలుంటే అంత మందికి సంవత్సరానికి రెండు దఫాలుగా ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న పిల్లలకు రూ. 20 వేలు, పాలిటెక్నిక్ పిల్లలకు రూ.15 వేలు, ఐటీఐ పిల్లలకు రూ.10 వేలు ఇస్తున్నాం. చదువు కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలవ్వరాదని, ఇల్లు.. పొలాలు అమ్ముకునే పరిస్థితి రాకూడదన్న గొప్ప ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నాం అని ఆయన అన్నారు.


