
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్రామ సచివాలయాలను ఈ నెల 26 నుంచి పూర్తిస్థాయిలో సేవలు ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్కుమార్ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పౌర సేవలు సచివాలయాలు ద్వారా అందిస్తామని.. దేశంలో ఇన్ని సేవలు.. గ్రామాలు, వార్డుల్లో అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని ఆయన తెలిపారు. సచివాలయాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించామని.. వచ్చే నెల నుంచి వార్డు సచివాలయాలు,వాలంటీర్ల ద్వారా పింఛన్ల చెల్లింపులు చేస్తామని చెప్పారు. రెండు నెలల్లో మొత్తం సేవలన్నీ అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 24 గంటల్లో కొన్ని, 72 గంటల్లో కొన్ని సేవలను అందిస్తామని వివరించారు. ప్రతి రోజు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. దరఖాస్తులు సచివాలయంలోనే చేసుకోవచ్చని తెలిపారు. మున్సిపాలిటీల్లో ప్రజలకు ఈ సచివాలయాలు ద్వారా తక్షణ సేవలు అందుతాయని కమిషనర్ తెలిపారు.


