
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మున్నిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. జనవరి 7న పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 30న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. డిసెంబర్ 31వ తేదీన జిల్లా అధికారులతో రాజకీయ పార్టీల సమావేశం నిర్వహిస్తారు. జనవరి 1న మున్సిపల్ కమిషనర్లతో ఈసీ భేటీ అవుతుంది. జనవరి 3న అభ్యంతరాలకు పరిష్కారం, వివరణ ఇస్తారు. జనవరి 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు. జనవరి 10న నామినేషన్లకు చివరి తేదీ జనవరి 11న నామినేషన్ల పరిశీలన జనవరి 14న ఉపసంహరణకు తుది గడువు జనవరి 22న పోలింగ్ జనవరి 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16న ప్రచురించిన అసెంబ్లీ ఓటర్ల ముసాయిదా జాబితాకు అనుగుణంగా మున్సిపల్ ఓటర్ల జాబితాలను తయారు చేయాలని సూచించింది. ఈ జాబితా మేరకు పట్టణ ఓటర్లను గుర్తించి.. వార్డుల వారీగా జాబితాలను సరిచూసుకోవాలని స్పష్టం చేసింది. వార్డుల పునర్విభజనకు అనుగుణంగా ఓటర్లు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పంద్రాగస్టులోపు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో జూలై 16న పురపాలక సంస్థల ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించింది.
తెలంగాణలో జీహెచ్ఎంసీతో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, 142 మున్సిపాలిటీలు ఉన్నాయి. 2014 నాటికి రాష్ట్రంలో 73 మున్సిపాలిటీలు ఉండేవి. తర్వాత మేజర్ గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా, ఆ తర్వాత మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేశారు. ఇక ఈ మున్సిపల్ ఎన్నికల పై హైకోర్టు ఈ విధంగా స్పందించింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడ పాత చట్టం ద్వారా ఎన్నికలు ఎందుకని ప్రశ్నించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సోమవారం (డిసెంబర్ 23) సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబర్ 30న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.




