తెలంగాణముఖ్యాoశాలు
కవితకు ఊరట… బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణల నేపథ్యంలో సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవిత కు స్వల్ప ఊరట లభించింది. పరువునష్టం దావాను పరిశీలించిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ , మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాలపై పరువునష్టం కవిత దావా వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తనపై నిరాధార ఆరోపణలు చేశారని పిటిషన్ పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత న్యాయవాదులు కోరారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజింధర్కు నోటీసులిచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు.ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి ఆదివారం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పైన, కవితపైన నేరుగా ఆరోపణలు చేశారు. ఇందులో కవిత భర్త తరఫు బంధువుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు సంబంధిత వర్గాలు మరికొన్ని వివరాలను బయటపెట్టాయి. ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా ఆదివారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి మద్యం కుంభకోణంపై మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీ మద్యం విధానం రూపొందిందని.. ఈ విధానం రూపకల్పనకు సంబంధించిన భేటీలకు వారు కూడా హాజరయ్యారని.. తొలుత మాట్లాడిన పర్వేశ్ వర్మ ఆరోపించారు. ఈ కుంభకోణానికి సంబంధించి దేశ వ్యాప్తంగా 31 స్థావరాలపై దాడులు జరిపి 16మందిపై ఎఫ్ఐర్ దాఖలు చేసిన సీబీఐ.. వారిలో 8 మందిపై ఆదివారం లుకౌట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ చేసింది. ఇప్పటికే అయిదుగురిని విచారించిన సీబీఐ ఈ 8 మందిని కూడా విచారించే అవకాశాలున్నాయి. ఈ 8 మందీ ప్రైవేట్ వ్యక్తులేనని సీబీఐ స్పష్టం చేసింది. సిసోడియా, గోపీ కృష్ణ, ఆనంద్ తివారీ, పంకజ్ భట్నాగర్ ప్రభుత్వ హోదాల్లో ఉన్నందువల్ల వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేయలేదని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తు ల్లో ఒకరైన పెర్నాడ్ రికార్డ్ కంపెనీ మాజీ ఉద్యోగి మనోజ్రాయ్పైనా ఎల్వోసీ జారీ చేయలేదని తెలిపారు.



