
ప్రపంచంలో ఏ ఆలయంలోనూ లభించని అద్భుత రుచి, కమ్మదనం తిరుపతి లడ్డుకి మాత్రమే ఉందనటంలో సందేహం లేదు. అసలు తిరుమల తిరుపతి వెళుతున్నామని ఎవరైనా అంటే మాకూ ఓ లడ్డు తెచ్చిపెట్టండి అంటారు చాలా మంది. అంతటి కమ్మదనాన్ని అందిస్తున్నఈ రుచికర ప్రసాదానికి తోడుగా వడ ప్రసాదం కూడా సామాన్యభక్తులుకు అందుబాటులోకి తీసుకువస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.
ఇప్పటికే ఎవరి సిఫారసులు అవసరం లేకుండా.. ప్రత్యేక కౌంటర్ల ద్వారా శ్రీవారి కల్యాణం లడ్డూలను సామాన్య భక్తులకు కూడా అందేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 12న సామాన్య భక్తులకు శ్రీవారి కల్యాణం లడ్డూను సైతం అందుబాటులోకి తెచ్చి, రూ.200గా ధర నిర్ణయించి.. చిన్న లడ్డూతో పాటు కల్యాణం లడ్డూను అందిస్తోంది.
తాజాగా భక్తులకు అరుదుగా దొరికే ‘వడ’ ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిందని ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాకు తెలిపారు. గురువారం నుంచి భక్తులకు వడ ప్రసాదం కౌంటర్లలో విక్రయిస్తారని తెలిపారు. ఇక నుంచి రోజుకు 10 వేల కల్యాణం లడ్డూలు, 10 వేల వడ ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేశామని సింఘాల్ తెలిపారు.



