Allఆంధ్రప్రదేశ్

ముట్టడిస్తాం.. కట్టడిచేస్తాం అంటే చూస్తూ ఊరుకోము



అమరావతి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆందోళనకారులకు వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీని ముట్టడిస్తాం.. కట్టడిచేస్తాం అంటే నడవదని స్పష్టం చేశారు. చట్ట సభలను అడ్డుకోవడం, ముట్టడి కార్యక్రమాలు చేపట్టడం అనేది సభా హక్కుల, రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని వెల్లడించారు. 

రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సివస్తుందని హెచ్చరించారు. చట్ట సభల్లోకి అగంతకులు ప్రవేశించకూడదనే నియమాలు ఉన్నాయని గుర్తుచేశారు. నిరసనలు తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. అయితే ఆ నిరసనలు చట్టాలకు లోబడే ఉండాలని సూచించారు. ముట్టడిస్తాం.. కట్టడి చేస్తాం అంటూ చట్ట సభలకే హెచ్చరికలు చేస్తున్నారని, ఈ పద్దతి సరికాదని విపక్ష పార్టీలకు స్పీకర్ సీతారాం హితవు పలికారు.

అమరావతి భవితవ్యం తేల్చేందుకు రేపటి నుంచి మూడ్రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. అలాగే పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. చట్టాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker