All
అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి గుడ్బై ……వెల్కమ్ శైలజానాథ్…..
ఏపీ కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ పార్టీకి కొత్త బాస్ను హైకమాండ్ నియమించింది. ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సీనియర్ నేత సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. దీంతో పాటు గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో శైలజానాథ్ను అధ్యక్షుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా సీనియర్ నేతలు తులసిరెడ్డి, మస్తాన్ వలీకి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
శైలజానాథ్ వైఎస్ హయాంలో ప్రభుత్వ విప్గా, కిరణ్కుమార్రెడ్డి హయాంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. అనేకమైన పదవుల్లో పని చేసిన అనుభవం శైలజానాథ్ సొంతం. మరి కొత్త ఏడాదిలో కొత్త బాస్ పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి.




