
ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి కి బంగారు మకర తోరణం తయారు చేస్తున్నట్లు సహాయ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి వి హరి సూర్య ప్రకాష్ , ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ లు మీడియాకు చెప్పారు. శుక్రవారం ఉదయం దేవాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ గారు మాట్లాడుతూ స్వామివారికి ఇప్పటి వరకు భక్తులందించిన కానుకలతో బంగారు ఆభరణాలు అన్ని సమకూరాయి… ఇంకా బంగారు మకరతోరణం మాత్రమే మిగిలి ఉందని.. దానిని కూడా దాతల సహకారంతో కొద్దిరోజుల్లోనే తయారు చేసేందుకు సిద్దమవుతున్నట్టు చెప్పారు. సుమారు 70 లక్షల రూపాయల వ్యయంతోఈ బంగారు మకర తోరణాన్ని తయారు చేయిస్తామని చెప్పారు. ఈ బృహత్తర కార్యక్రమం పాలు పంచుకునే దాతలలో లక్ష రూపాయలు పై చిలుకు విరాళంగా ఇచ్చిన దాతలకు రథసప్తమి రోజు స్వామివారి దర్శనం చేసుకునేందుకు వీలుగా డోనర్ పాసును మంజూరు చేస్తామని , దీని పై దాతతో పాటు మరి ముగ్గురిని అనుమతి ఇస్తామని పేర్కొన్నారు ఇప్పటికి సుమారు 30 లక్షల రూపాయలు వరకు ఇవ్వడానికి దాతలు ముందుకు వచ్చారని, ఇంకా దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు.
ప్రముఖ వ్యాపారవేత్త, దాత అయిన మండవల్లి రవి గారు మాట్లాడుతూ స్వామి వారికి బంగారు మకరతోరణం తయారు చేసే కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వామి వారిని పూర్తిగా బంగారు ఆభరణాలతో భక్తులు దర్శనం చేసుకునేలా కృషి చేస్తామని చెప్పారు. దేశంలోనే ఏకైక నిత్యపూజలందుకుంటున్న సూర్య దేవాలయం మన అరసవల్లిలో ఉండడం జిల్లా ప్రజలకు ఎంతో అదృష్టం చేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.




