Allఆంధ్రప్రదేశ్
కేసులు పెట్టాల్సింది రైతులపై కాదు..అధికారులపై

సీఆర్డీఏ పరిధిలో ఉన్న భూములను సర్వే చేస్తామంటే ప్రభుత్వం తహసిల్దార్లని పంపిస్తోందని, వారు నోటికొచ్చినట్టు రైతులపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి. గురువారం ఆమె అమరావాతి రైతు దీక్షా శిబిరాన్ని సందర్శించిన అనంతరం మీడియాలో మాట్లాడుతూ సర్వేను అడ్డుకున్నందుకు 426 మంది రైతులపై కేసులు పెట్టటమేంటని నిలదీసారు. రాజధానికోసం ఇచ్చిన భూములలో ఇళ్ల పట్టాలిస్తామంటూ కొత్త ప్లానులేస్తూ జనం మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసులు పెట్టాల్సింది రైతులపై కాదు.. దొంగదారిన వస్తున్న అధికారులపై పెట్టాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లోకి రెవెన్యూ అధికారులు వస్తే ఏ సంతకాలూ పెట్టవద్దని రైతులకు సూచించారు నన్నపనేని రాజకుమారి.
మరోవైపు ఏపీఐఐసీ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఓ కార్యక్రమానికి వచ్చి దొడ్డిదారిన పలాయనం చిత్తగించడంపై స్పందించిన నన్నపనేని, జబర్దస్త్లో రోజా మహానటిగా కనిపిస్తోంది. ఇప్పుడు నిజజీవితంలోనూ మహానటిని మించి అద్భుతంగా నటిస్తోందంటూ ఎద్దేవా చేశారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులని ఏ ప్రాతిపదిక రోజా అన్నారని నిలదీసేందుకు రైతులు అడ్డుకున్నారని, జై అమరావతి అనాలని డిమాండ్ చేసారని, అయితే రోజా డీజీపీకి ఫోన్ చేసి వారిపై పోలీసులతో దాడి చేయించేందుకు సిద్దమైందని మండి పడ్డారు. ఆంధ్రుల రాజధాని అమరావతి అని నిర్ణయించినప్పుడు ఆమె కూడా అసెంబ్లీలో ఉందని, ఆ పార్టీ అధినేత జగన్ అమరావతికి అప్పుడు జై కొట్టలేదా? అని ప్రశ్నించారామె. రోజుకో రంగంగా ప్రజలని ఇబ్బంది పెడుతున్న పాలనలో ఇంకెన్ని దాష్టికాలను చూడాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేసారు నన్నపనేని.



