గడప గడపకూ…… గప్ చిప్ !

*ప్రత్యేక హోదాను పడుకోపెట్టారు
*ఢిల్లీలో కేంద్రంను…. ఆంధ్రాలో ప్రజలను మోసం చేశారు
*మహిళలపై దాడులు… హత్యలు, అత్యాచారాలు
ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు మొత్తం గతచంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలపైనే ఆధారపడ్డారు. ప్రత్యేక హోదాను గత ప్రభుత్వం కేంద్రానికి తాకట్టు పెట్టిందని, పోలవరం ప్రాజెక్టును లంచాల కోసం చంద్రబాబు చేపట్టారని, అమరావతి చంద్రబాబు బినామీలదని, విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్నీ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి
ఆపాదిస్తూ, నిందలు వేస్తూ, ఏ ఒక్క సంఘటనకూ ప్రస్తుత ప్రభుత్వం బాధ్యత తీసుకోవటం లేదు. అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి అంటారు. కానీ ముఖ్యమంత్రి , వైకాపా నాయకులకు అతికినట్లు ఉండాల్సిన పని లేదు. అబద్ధమయితే చాలు ఈ మూడేళ్ల పాలనా కాలంలో ముఖ్యమంత్రి కానీ, ఆయన మంత్రివర్గ సహచరులు కానీ మొత్తంగా విమర్శల పైనే ఆధారపడ్డారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే, ఢిల్లీ వెళ్లి కేంద్రం మెడలు వంచి ప్రత్యెక హోదా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఢిల్లీ వెళ్ళారు కానీ, మోదీ మెడలు
వంచలేదు సరికదా మోకాళ్ళపై పడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వైకాపా అవసరం లేదని, కాబట్టి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా హోదా అడుగుతుంటామని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ ను చంద్రబాబు ప్రభుత్వం కేవలం లంచాల కోసం, అవినీతి కోసం తాము నిర్మాణం చేస్తానని చేపట్టారు తన బినామీలకు, అయిన వారికి ఇచ్చారని ప్రజలను నమ్మించారు. పోలవరాన్ని ఏటీఎంగా, పేటీఎంగా వాడేసుకుంటున్నట్లు ప్రచారం చేశారు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాకా పోలవరాన్ని కేంద్రానికి అప్పచెప్పకుండా మరో రెండేళ్లలోను పోలవరం పూర్తి కాదు అన్న
పరిస్థితి తెచ్చారు. 77 శాతం పూర్తి చేసిన పోలవరం పనులను మూడేళ్ళ పాలనలో కొంత
కూడా పూర్తి చేయలేకపోయారు. పోలవరం పూర్తి చేస్తానని రంకెలు వేసిన మాజీ మంత్రి
ఎక్కడ ఉన్నాడో తెలియదు. క్యూసెక్కులు, టిఎంసీల గూర్చి ఓనమాలు కూడా తెలియని కొత్త మంత్రికి ఏం చెప్పాలో తెలియదు. ఏపీ రాజధానిగా అమరావతిని చంద్రబాబు
కంటే ఎంతో మిన్నగా నిర్మిస్తామని అన్న మాటలు ప్రజల మరువలేదు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే రాజధానిపై ఉక్కుపాదం మోపారు. ఎడారి అనీ, స్మశానం అనీ, కమ్మవారిదే అనీ చంద్రబాబు బినామీలది అనీ చాలా పేర్లు పెట్టారు. రాజధాని రైతులను రోడ్డెక్కాలా చేశారు. మూడు రాజధానులు అనే మూర్ఖపు ఆలోచనతో మూడు ప్రాంతాల్లో విభజన మంటలు రేపారు. ఆంధ్రుల రాజధాని అమరావతిని దేశ ప్రజల ముందు నవ్వులపాలు చేశారు. ఆఖరికి అత్యున్నత న్యాయస్థానం రాజధాని మార్పు అధికారం శాసనసభకు లేదని చెబితే, న్యాయమూర్తులకు తాటాకులు కట్టారు. మరో పెద్ద అబద్ధం ఎస్సీ, ఎస్టీ, బీసీ,
మైనార్టీ మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు. తెలుగు నేలపై ఎన్నడూ జరగనన్ని నేరాలు ఘోరాల సంఘటనలు గత మూడేళ్లలో ఎన్నో జరిగాయి. మద్యం ధరలను
ప్రశ్నిస్తే ఓంప్రకాష్ను ఆత్మహత్యకు పాల్పడేలా చేశారు. మానసిక వికలాంగురాలిపై, మూగ మహిళపై అత్యాచారాలు జరిగాయి. ఇన్ని జరిగినా తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ గడప గడపకి వైసిపి అంటూ నేతలను ప్రజలమీద వదల గా ప్రజా ఆగ్రహం చూసిన నేతలు తమ గడపలకే పరిమితమై పోయారు.



