

తిరుపతిలో ఇటీవల నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో రాజకీయ నాయకులపై, కథానాయికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆ విషయం మర్చిపోకముందే ఆయన ఇంట
ఓ విషాదం చోటుచేసుకుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సొంతూరు నెల్లూరు అన్న విషయం తెలిసిందే. ఆయన చెన్నైకి మకాం మార్చినా అతని తల్లిదండ్రులు చాలా కాలంగా నెల్లూరులోనే ఉంటున్నారట. దాదాపు అన్నిభాషల్లో గాన గాంధర్వుడిగా పేరుతెచ్చకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తల్లి శకుంతలమ్మ (89) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో తుది శ్వాస విడిచారు.
ప్రస్తుతం ఓ సంగీత కచేరి నిమిత్తం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లండన్లో ఉన్నారు.అయితే తల్లి మరణవార్త తెలిసిన వెంటనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హుటా హుటిన స్వగ్రామానికి బయలు దేరారని తెలిసింది. ఈ రోజు(సోమవారం) సాయంకాలానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నేరుగా నెల్లూరుకు చేరుకుంటారని, ఆ తరువాతే ఆయన తల్లి అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం బాలు నెల్లూరు చేరుకుంటారు. ఆయన చేరుకునే సరికి రాత్రి అయ్యే అవకాశం వుంది కాబట్టి శకుంతలమ్మ అంత్యక్రియలు మంగళవారం నెల్లూరులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బాలు తల్లి మృతిపట్ల పలువురు దక్షిణాతి చలన చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు




