కమలం చెంతకు కొండా దంపతులు?

ఒకప్పుడు .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహించి, ఓరుగల్లు రాజకీయాలను శాసించిన కొండాదంపతులు ఇప్పుడు రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నది వాస్తవం. తమ ఇద్దరికీ పదవుల్లేక ఓ వైపు ఇబ్బంది పడుతుంటే మరోమైపు తమకుమార్తె సుస్మిత పటేల్కు రాజకీయ భవిష్యత్ పై ఈ దంపతులలో ఆందోళన కనిపిస్తోంది.
టీడీపీతో మొదలైన వీరి రాజకీయ ప్రస్థానం అటు తర్వాత కాంగ్రెస్కు, వైఎస్సార్సీపీకి, అటు తర్వాత టీఆర్ఎస్కు, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్లోకి మారింది. గత ఎన్నికల ముందు టిఆర్ఎస్ టిక్కెట్ భరోసా దొరక్క కాంగ్రెస్లోకి వచ్చిన సురేఖ తనతో పాటు కూతురు సుస్మితకు భూపాలపల్లి టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉంచినా, కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించలేదు. పరకాలలో గెలిచిరావాలని సూచించడంతో పరకాలతో పాటు మరో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ను గెలిచి చూపిస్తామని కొండా మురళి సవాల్ చేసినా కొండా సురేఖ పోటీ చేసిన పరకాలలో సైతం ఘెరంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఓటమిని జీర్ణించుకోలేక పోతున్న కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకుదూరంగానే ఉంటున్నారు.
అయితే తాజాగా తమ కుమార్తె రాజకీయ భవిష్యత్ కోసమంలూ కండువా మార్చే పనిలో ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల నాటికి ఇద్దరికి టికెట్ సాధించుకోవాలని కొండా రాజకీయ దంపతులు యోచిస్తున్నారట. అయితే కొండా దంపతులు బీజేపీలో ఇమడలేరని, వారసత్వ రాజకీయాలు ఆ పార్టీలో ఏమాత్రం సాగబోవని కొందరు సన్నిహితులు చెపుతుంటే, కాంగ్రెస్లో ప్రాధాన్యం పెంచుకునే వ్యూహంతో కొండా దంపతులే ఇలాంటి లీకులు మీడియాకు ఇస్తున్నారనే వాదనను కొంతమంది వినిపిస్తున్నారు.
అయితే ప్రస్తుతం భూపాలపల్లిలో బిజెపి పార్టీ బలోపేతం కావడంగా ఉండటంతో ఒకవేళ కమల తీర్ధం తీసుకుంటే ఆ సీటును తమ కూతురుకి ఇవ్వాలని డిమాండ్ ముందుంచే అవకాశం ఉంది. అయితే అక్కడ కీర్తిరెడ్డి మంచి క్యాడర్ను తయారు చేసుకుని రానున్న ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్న తరుణంలో ఆమెను కాదని సుస్మితాకు టిక్కెట్ ఇస్తారా? అన్నది యక్ష ప్రశ్నే…. మరి ఏం జరగనుందో చూడాలి.



