విద్యార్థుల దాహం తీరేదెలా..

కొమురంభీం జిల్లా వాంకిడి మండలంలోని అర్జు గూడా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ని విద్యార్థులు తాగడానికి నీళ్లు లేక తహతహలాడుతున్నారు. ఆ పాఠశాలలో సుమారు రెండు వందలకు పైగా విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. అంత మంది విద్యార్థులకు కలిపి త్రాగునీటి వసతి కి ఒకే ఒక బోరింగు ( చేతి పంపు ) ఉండడంతో విద్యార్థులు నీళ్ళు తాగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ఒక బోరింగు సైతం కొద్దిరోజులుగా మొరాయించడంతో విద్యార్థులు ఇంటి నుండి తమవెంట తీసుకు వచ్చే ఒక బాటిల్ నీళ్ల తోనే సర్దుకుంటున్నారు. బడి బాట కార్యక్రమంలో ఈ పాఠశాల ఎంపిక అయినప్పటికీ కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యను పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గ్రామపంచాయతీ దృష్టికి తీసుకెళ్లి నప్పటికీ పట్టించుకోవడంలేదని తెలుపుతున్నారు. ఇప్పటికైనా చేతి పంపు మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు నీటి సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.




