ఆంధ్రప్రదేశ్
ఏ పదవి చేపట్టినా వన్నె తెచ్చిన నాయకుడు వెంకయ్య నాయుడు : పవన్ కల్యాణ్

ఏ పదవి చేపట్టినా.. వన్నె తెచ్చిన నాయకుడు వెంకయ్య నాయుడు అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించి, అత్యవసర పరిస్థితిని ఎదిరించారని చెప్పారు. ఆరు నెలలపాటు జైలు జీవితం మొదలుకుని ఇప్పటి ఉపరాష్ట్రపతి పదవి వరకు వెంకయ్యనాయుడు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో అనుభూతులు ఉన్నాయని పవన్ తెలిపారు. అయిదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏ పదవీ లేకుండా ఆయన ఎప్పుడూ లేరన్నారు. వెంకయ్య రాజకీయ మేధావి అని కొనియాడారు. ఇటు శాసనసభ, అటు రాజ్యసభల్లో ఆయన చేసిన ప్రసంగాలు ప్రతీ ఒక్కరిని ఆలోచింపచేశాయన్నారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై వెంకయ్య నాయుడుకు ఉన్న పట్టు, వాగ్ధాటి ప్రతి ఒక్కరినీ సమ్మోహనపరుస్తాయన్నారు. ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసి ప్రజలతో మమేకం కావటానికి సమాయత్తమవుతున్న తరుణంలో వెంకయ్య నాయుడుకు తాను హార్దిక శుభాకాంక్షలు చెబుతున్నానని పవన్ తెలిపారు.




