టీటీడీలో ఇంటి దొంగల గుట్టురట్టు..

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో కూడా అర్చకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే నెట్టివేస్తున్నారు. తిరుమలలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆన్లైన్లో దర్శనం స్లాట్, సప్తగిరి అతిధి భవనంలో వసతి బుక్ చేసుకున్నాం. గది ఖాళీ చేసేటప్పుడు అక్కడున్న సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారు. ఇలాంటి అవినీతిని అరికట్టండి’ అంటూ పలువురు భక్తులు తిరుమలలో గురువారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.ఈవో ధర్మారెడ్డి స్పందిస్తూ..వైకుంఠం క్యూకాంప్లెక్స్లో డబ్బులు తీసుకుని దర్శనానికి పంపిన ఘటనపై సీసీ కెమెరాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని, టీటీడీ ఆలయాల్లో అర్చకులెవరైనా అడిగితే చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. టీటీడీ ఉద్యోగులకు భక్తులతో ప్రవర్తించే విధానంపై త్వరలో ప్రత్యేకంగా శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. తిరుమల కాటేజీల్లో వేడినీళ్లు రావడం లేదని తెలుపగా, సెప్టెంబరు నాటికి అన్ని వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుచానూరు ఆలయంలో భద్రతా సిబ్బంది ప్రవర్తన బాగాలేదని ఫిర్యాదు చేయగా, తగిన చర్యలు తీసుకోమని సీవీఎస్వోను ఆదేశిస్తామన్నారు. దాతలు దర్శనానికి రాకపోయినప్పటికీ వారికిచ్చే లడ్డూలు, వస్త్రం, బంగారు డాలర్ షరతులు లేకుండా అందించాలని కోరగా అందిస్తామని ఈవో సమాధానమిచ్చారు. 2004లో శ్రీవారి అభిషేక సేవకు డబ్బులు కడితే 2021కి వచ్చిందని,కరోనా కారణంగా దాన్ని రద్దు చేశారని, తిరిగి అభిషేకం టికెట్ ఇవ్వాలని ఓ భక్తుడు కోరగా ఈవో స్పందిస్తూ శ్రీవారి అభిషేక టికెట్లు 2050 వరకు భక్తులు బుక్ చేసుకున్నారని, తిరుమలలో లక్కీడిప్ ద్వారా రోజూ 10 టికెట్లను కేటాయిస్తారని, గురువారం రిజిస్టర్ చేసుకుని టికెట్లు పొందవచ్చని తెలిపారు.




