జగనన్నా.. జెండాలేవీ?……సాక్షాత్తు కేంద్ర హోం మంత్రికే చెప్పిన సీఎం

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 1.62 కోట్ల జాతీయ జెండాలు పంపిణీ చేస్తాం’.. ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్ చెప్పిన మాట ఇది. పంద్రాగస్టు వేడుక వచ్చేసింది. అయితే జగన్ చెప్పిన స్థాయిలో జెండాలు పంపిణీ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం చెప్పిన దాంట్లో సగం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. రాష్ట్రంలో 65 లక్షల జెండాలు కూడా ఎగరేయలేని పరిస్థితి ఉందని సమాచారం. గ్రామ, వార్డు సచివాలయాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు మినహా చాలా చోట్ల జెండాలు కనిపించడం లేదని చెబుతున్నారు. ప్రజల ఇళ్లపై జెండాలు ఎగరడం లేదని అంటున్నారు. ఆగస్టు 15నాటికి ప్రతిఇంటిపైనా మూడు రంగుల జెండా ఎగరేసేలా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమాయత్తం చేసింది. గత నెలలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్భాటంగా జెండా పండుగ నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా జగన్ చెప్పారు. ప్రజల్లో దేశభక్తి పెంపొందించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిపైనా, పరిశ్రమలు, సంస్థలు, వాణిజ్య సముదాయాలు, షాపులపై జెండాలు ఎగరేస్తామని చెప్పారు.జగన్ చెప్పినట్టుగా రాష్ట్రంలో అలాంటి వాతావరణం కనపడటం లేదు. జెండాలు కావాలనుకున్న వారికి ఎక్కడ దొరుకుతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ కార్యాలయాలకు, గ్రామ, వార్డు సచివాలయాలకు జెండాలు పంపిణీ చేసి ఎగరేయాలని ఆదేశాలిచ్చింది. పింఛన్లు పొందుతున్న వారి కుటుంబాలకు సచివాలయాల్లో వలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. చేయూత పెన్షన్ పొందుతున్న కుటుంబాలకు పట్టణాల్లో పొదుపు గ్రూపు సీఆర్పీలు పంపిణీ చేస్తున్నారు. మిగిలిన వారికి జెండాలు అందడంలేదు.




