Allఆంధ్రప్రదేశ్
టిడిపి ప్రజా చైతన్యయాత్ర ఆరంభం

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్నవిధానాలను ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ బుధవారం నుంచి ప్రజా చైతన్యయాత్రను చేపట్టింది. దాదాపు 100 నియోజకవర్గాలలో 45 రోజుల పాటు చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ యాత్ర కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా, పరుచూరి నియోజక వర్గంలోటీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ మోసాల పాలన జగన్ సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజా వేదిక కూల్చి వేతతో పాలన ప్రారంభించిన జగన్ ఈ 9 నెలలో గత ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిన ఘనత జగన్కి చెల్లుతుందని అన్నారు. వైసీపీ దుర్మార్గ పాలనలోగిట్టుబాటు ధరలేక రాష్ట్రంలో 290 మంది రైతులు, ఇసుక కొరతతో 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నాఈ పాలకులకు పట్టడం లేదని వ్యాఖ్యానించారు. తమకు వారసత్వంగా వస్తున్న భూములను రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతులను ఇష్టాను సారంగా వైసిపి నేతలు ఆడి పోసుకుంటున్నారని, రాజధానికి భూములిచ్చిన రైతుల్లో 45 మంది రైతులు, రైతుకూలీలు ఆవేదనతో చనిపోవటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు.
పాలన చేతకాక రాబడి మార్గాలను చూపే అమరావతిని ఓ కులం పేరుతో అందరినీ వేధించే పనిలో అధికార పార్టీ పడిందని, ఇందుకు ఇంకెందరు బలికావాలని ఆందోళన వ్యక్తం చేసారు. మూడు రాజధానుల మాటున వైసిపి నేతలు భూదందాలు సాగిస్తున్నారని, పారదర్శకత అంటూనే నేతలు ప్రతి పనికీ ఇంత అని నిర్ధారించేసారని ఎద్దేవా చేసారు చంద్రబాబు. ప్రజల బాగు కోరే ప్రభుత్వాలను ఇప్పటివరకు రాష్ట్రాన్ని పాలిస్తే, దేశ చరిత్రలో తామనుకున్నది చేసుకునేందుకు తొలిసారి ప్రజలను చంపే ప్రభుత్వాన్ని చూస్తున్నామని మండిపడ్డారు.




