జగన్ కేసుల కోసం బీజేపీతో కలవాలని వైసీపీ డ్రామాలు…

ప్రస్తుత పరిస్థితిలో ఓ రాజకీయ పార్టీని నడపడం సాధారణ విషయం కాదని, నాకు ఎలాంటి వ్యాపారాలు, ప్యాలస్లు, పెద్ద పెద్ద భవంతులు, టివి ఛానళ్లు లేవని, నాకు తెలిసిందంతా సినిమాలలో నటించడం, అందుకే జనసేన పార్టీని నడపడం కోసమే సినిమాలు చేస్తున్నానని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు.
అమరావతిలోని పార్టీ ఆఫీసులో గుంటూరు జిల్లా నేతలతో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో వేలకోట్లు సంపాదించాలనే ఆలోచన తనకు లేదని, సొంత డబ్బు తో వ్యవస్థను కొంతైనా మార్చాలనే తపనతోనే రాజకీయాలలోకి వచ్చానని, అయితే తనకు వచ్చే ఆదాయంపైనే కుటుంబం, పార్టీ ఆర్థిక వ్యవహారాలు నడుస్తున్నందున సినిమాలు చేయక తప్పని సరి పరిస్థితి అని చెప్పారు. దీనిని కొందరు తప్పుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వంలో లాబీయింగ్ చేసి కాంట్రాక్టులు ఇప్పించి అవినీతిని ప్రోత్సహించి డబ్బులు తీసుకుని జనసేనని నడపడం తనకి మనస్కరించదని చెప్పుకొచ్చారు పవన్
ప్రస్తుతం రూ. 2 వేలు ఇస్తేనే ఓటేసేందుకు ఓటరు పోలింగ్ బూత్ కు వెళ్లే ట్రెండ్ కు రాజకీయ పార్టీలు తీసుకువచ్చాయని, ఈ క్రమంలో టిడీపీ, వైసీపీ చేస్తున్న డ్రామాలు అందరికీ అర్థమవుతాయని అన్నారు. ప్రజలకు జనసేన ఏకైక ఆప్షన్ గా నిలుస్తుందనటంలో సందేహించనని చెప్పారు.
జగన్ బిజెపి అలయస్స్లో చేరుతున్నారంటూ నేతలు ఆడిగిన ప్రశ్నలకు పవన్ సమాధానమిస్తూ, జగన్ కేసుల కోసం బీజేపీతో కలవాలని వైసీపీ డ్రామాలు చేస్తోందని, ఇందుకు అనుగుణంగా మీడియాలో మంత్రులు ప్రకటనలు చేస్తున్నారే మినహా ఢిల్లీలో అలాంటి పరిస్థితి లేదని అన్నారు. పలు కేసులలో ఏ 2గా ఉన్న వ్యక్తులను కేంద్ర ప్రభుత్వ మంత్రి వర్గంలోకి తీసుకుంటారంటూ వైసిపీ ప్రచారం చేస్తోందని ఆగ్రహంవ్యక్తం చేసారు. ఇప్పటికే రాష్ర్ట భవిష్యత్ నాశనం చేసేలా వైసిపి నిర్ణయాలున్నాయని, ఏపీ భవిష్యత్తు కోసమే జనసేన బీజేపీతో కలిసి నడుస్తోందని చెప్పారు. వైసిపి బిజెపి కూటమిలో చేరితే… తను ఆ కూటమికి రాం రాం చెప్తానని స్పష్టం చేసారు పవన్ కళ్యాణ్.



