
సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హసన్ నేడు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికి గానూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ను ‘హల్వా బడ్జెట్’ గా అభివర్ణించారు. హల్వా సెరిమనీతో ఈ బడ్జెట్ మొదలైందని, అలాగే ఈ దేశప్రజలకు ‘హల్వా’ ఇవ్వడంతో ముగిసిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నార్త్ బ్లాక్లో ఆర్థిక శాఖ ప్రధాన కార్యాయలంలో తయారు చేసిన ఈ హల్వాని అధికారులకు అందించడంతో ఈ బడ్జెట్ ప్రారంభమైంది. చివరకు సామాన్య ప్రజలకు దీన్ని ఇవ్వడంతో సమాప్తమైంది.. అంటే సుదీర్ఘమైన ప్రసంగమైతే ఉంది కానీ.. ఖఛ్చితమైన పరిష్కారాలు లేవు అని ఆయన ట్వీట్ చేశారు. లోక్ సభలో బడ్జెట్ సమర్పణకు ముందు ప్రభుత్వం హల్వా సెరిమనీని సంప్రదాయంగా నిర్వహిస్తోంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని కమల్ హసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ప్రయోజనాలకు అనువుగా ఈ బడ్జెట్ లేదని ఆయన ఆరోపించారు.




