
హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిధిగా విచ్చేసిన నిర్మాత అల్లూ అరవింద్ జండా ఆవిష్కరించి వేడుకలు ఆరంభించారు. చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు భారీగా మెగా అభిమానులు పాల్గొన్న ఈ వేడుకలని పురస్కరించుకుని బ్లడ్ బ్యాంక్లో స్వచ్ఛంధ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి రక్తదానం చేసేందుకు అనేక మంది మెగా ఫ్యాన్స్ విచ్చేసారు. వీరిలో అధిక సార్లు రక్తం దానమించిన జెపిఎస్ సోషల్ రెస్పాన్స్బులిటీ సంస్ధ సభ్యులను అల్లూ అరవింద్ ప్రత్యేక సన్మానం చేయటంతో పాటు వారికి జ్ఞాపికలు బహూకరించారు.
ఇలా ఈ సత్కారం అందుకున్నవారిలో మాదాపూర్ నుంచి 148 సార్లు రక్తదానం చేసిన కే. సంపత్ కుమార్, కూకట్ పల్లికి చెందిన ఎస్. వేణుగోపాల్ (109 సార్లు), ఖమ్మం నుంచి వచ్చిన బి. హరికృష్ణ (162 సార్లు), నేరేడ్ మెట్కి చెందిన సిఎస్ నాయుడు (62 సార్లు), కార్వాన్ నుంచి సిహెచ్ బాలసాయి (52 సార్లు) రక్తదానం చేసి ప్రశంసలందుకున్నారు.
ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత, సంతోషం పత్రికాధినేత సురేష్తో పాటు పలువురు సినీ ప్రముఖులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.




