
మందడంలో ర్యాలీ చేయడానికి ప్రయత్నించి రైతులే తమను రెచ్చగొట్టారని అందువల్లే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని పోలీసుల లాఠీచార్జికి దారి తీసిందని అమరావతి డిఎస్పీ వ్యాఖ్యానించారు. గత రెండు రోజులుగా రైతులు, మహిళలపై పోలీసులు దాడులు చేయటంపై జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకోవటం, మీడియాలో పోలీసులకు వ్యతిరేకత వార్తలు వస్తున్న నేపథ్యంలో రైతులపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని వచ్చిన ఆరోపణలపై డీఎస్పీ శ్రీనివాసరెడ్డి స్పందించారు.
శనివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ మందడంతో సహా పలు గ్రామాలలో 144సెక్షన్ అమల్లో ఉందని ఇదే విషయాన్ని ర్యాలీ చేసేందుకు బయలు దేరిన రైతులకు పోలీసులు వివరించారని, గుంపులు గుంపులుగా రావటం నేరమని తెలిపారని, ర్యాలీని విరమించుకోవాలని పలు పర్యాయాలు చెప్పినా రైతులు వినలేదని చెప్పారు. రైతులు ఆగ్రహంతో తమపై దురుసుగా ప్రవర్తించినప్పటికీ పోలీసులు ఎక్కడా నిగ్రహం కోల్పోలేదని, పదే పదే వెనక్కి మళ్లాలని కోరామని అప్పటికీ రైతులు తమపై దాడికి దిగడంతో వారిని అదుపులోకి తీసుకున్నామే కానీ ఎక్కడా దాడి చేయలేదని ఆయన స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు నుంచి 144 సెక్షన్ విధించడంపై తమకు ఎటువంటి మార్గదర్శకాలు అందలేదని మందడంలో 144సెక్షన్ విధించడం సాధారణమైన విషయమేనని తేల్చిచెప్పారు. అయినా సుప్రీం తీర్పు కేవలం జమ్మూకశ్మీర్కి మాత్రమేనని అమరావతికి కాదన్న విషయం విమ్సర్శలు చేసేవారు కొద్దిగా గుర్తుంచుకోవాలని సూచించారు.



