
లక్షల కోట్ల విలువ చేసే కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామికి అలంకరించే ఆభరణాలు కనులారా కాంచాలన్న కాంక్ష ఏభక్తునికి ఉండదు? అయితే అడపా దడపా మాత్రమే వీటిని వీక్షించేందుకు ఏ కొందరికో కలుగుతుండటంతో సామాన్య భక్తులు ఈ విషయంలో కాస్త దూరంగానే ఉన్నారని చెప్పాలి.
అయితే తాజాగా తిరుమల శ్రీవారి ఆభరణాలన్నింటినీ 3డి టెక్నాలజీని వినియోగించి భక్తులకు చూపించే ప్రక్రియను తిరుమల తిరుపతి దేవస్ధానం ఆరంభించింది. ఇందుకు సంబంధించిన సాంకేతికత సహాయం అందించాలని టెక్ మహేంద్రని అభ్యర్ధించడంతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆ సంస్ధ సిద్దమైంది.
స్వామివారి ఆభరణాలు 3డిలో చిత్రీకరణ విషయమై టెక్ మహేంద్ర సీఎండీ గురు నాన్నేశనివారం మీడియాలో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతం ఆయన మాట్లాడుతూ… త్వరలో తమ సంస్ధ ప్రతినిధులు అత్యంత భద్రత నడుమ శ్రీవారి నగలు చిత్రీకరిస్తారని తెలిపారు. త్వరలోనే వాటిని శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సందర్శనార్ధం తిరుమలలోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతామని చెప్పారు. శ్రీవారి ఆభరణాల చిత్రాలను ప్రదర్శనకు ఉంచడంతో పాటు ఆభరణాలకు సంభందించిన పూర్తి విషయాలను పుస్తక రూపంలో తీసుకువస్తామని గురు మీడియాకు తెలియజేశారు.




