
బయోపిక్ ల ట్రెండ్లో రాజకీయ నాయకుల బయోపిక్ లతో ఇండస్ట్రీ వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో నాయకుడి బయోపిక్ వెండితెరకెక్కించే ప్రయత్నం సాగడం అందరిలో ఆసక్తి పెంచుతోంది. ఏపీ రాజకీయాల్లో కీలక నాయకుడైన యువనేత .. వైయస్సార్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పై సినిమా తీసే ప్రయత్నం సాగుతోందిట. అయితే అది బయోపిక్ కాదు… హాఫ్ నేరేటెడ్ బయోపిక్.. జగన్ జీవితంలో కీలక ఘట్టాల్ని తీసుకుని తెరపై చూపించే ప్రయత్నం సాగుతోందిట. ఈ సినిమాకి జగన్ అనుయాయుడు, అభిమాని అయిన పోసాని కృష్ణ మురళి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.
`మెంటల్ కృష్ణ` తరువాత పోసాని చేస్తున్న ప్రయత్నమిది. ఇటీవలే జగన్ కథను రెడీ చేసుకుని కడప జిల్లా పులివెందులలో ఓ సినిమాని ప్రారంభించారని తెలుస్తోంది. మీడియాలో అనవసర రాద్ధాంతం చేయకుండా సైలెంటుగానే ఈ సినిమాని ప్రారంభించారట. ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని జగన్ క్యాంపు కార్యాలయంలోనే మొదలు పెట్టడం విశేషం. ఓవైపు వైయస్సార్ పాదయాత్రపై యాత్ర చిత్రం తెరకెక్కుతున్న వేళ ఇలా జగన్ పైనా సినిమా తీయడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అయితే ఇది జగన్ పై ఫీచర్ సినిమాయేనా? లేక రాజకీయ ప్రచారానికి ఉపకరించే సినిమానా? అన్నది ఇప్పటికి సస్పెన్స్. ఇప్పటికే లొకేషన్ల ఎంపిక పూర్తయింది. 20 రోజుల పాటు పులివెందుల చుట్టుపక్కల గ్రామాల్లో చిత్రీకరిస్తారట. గొల్డెన్ ఎర ప్రొడక్షన్ నెం.1 బ్యానర్పై శ్రీధర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.




