ఆంధ్రప్రదేశ్తెలంగాణముఖ్యాoశాలు
ఊపిరాగినా కాటి పన్ను కట్టాల్సిందే

ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు.. అన్నట్టుగా ఉన్నది కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పాలనలో సగటు మనిషి జీవితం. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను పేరుతో కేంద్ర,రాష్ట్రాల పన్నులను ఏకం చేసి ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సామాన్యుల ఉసురు తీస్తున్నది. పాణం బాగలేక దవాఖానకు చేరినా.. ఊపిరాగి చచ్చిపోయినా పన్నుల నుంచి మాత్రం తప్పించుకోలేని దుస్థితి. దవాఖాన బెడ్డు దగ్గర్నుంచి శ్మశానంలో కాటిదాకా జీఎస్టీ వర్తిస్తున్నది మరి. పాలు, పెరుగు, పెన్సిళ్లు ఇలా చెప్పుకొంటూపోతే కాదేదీ జీఎస్టీకి అనర్హం అనాల్సిందే. అసలే కరోనా దెబ్బకు కుదేలైన సామాన్యుడి జేబును కేంద్రం ఇలా దర్జాగా పన్నుల పేరుతో దోచేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయిప్పుడు. ఆ రంగం.. ఈ రంగం.. అన్న తేడా లేకుండా అన్నింటికీ పన్నుపోటు తప్పట్లేదు. ప్రస్తుతం 99 శాతం సేవలు, వస్తు ఉత్పత్తులపై జీఎస్టీ పడుతున్నదంటే అతిశయోక్తి కాదు. వీటిలో నిత్యావసరాలే ఎక్కువగా ఉండటం కలవరపెడుతున్నది. జాతి ప్రయోజనాల కోసమే జీఎస్టీని తెచ్చామని బీజేపీ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నా.. ఈ గలత్ సర్కార్ ట్యాక్స్కు ముందు 50 శాతాన్ని మించి ఆయా వస్తు ఉత్పత్తులు పన్ను పరిధిలో లేకపోవడం గమనార్హం.



