ఆంధ్రప్రదేశ్తెలంగాణముఖ్యాoశాలు
విగ్రహాలపై జీఎస్టీ భారం

విఘ్నాలను తొలగించేది వినాయకుడు అంటారు. కానీ విగ్రహాలను కొనేందుకే భక్తులకు భారమవుతోంది. ఈ ఏడాది విగ్రహాల ముడి సరకులకు జీఎస్టీ భారీగా పెంచడంతో ఆ మేర ధరలు ఆకాశాన్నంటాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 20 టన్నుల లారీకి కిరాయితో సహా రూ.4 లక్షల వరకు ఖర్చవుతోందని తయారీదారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో 11 అడుగుల విగ్రహం సుమారు రూ.40వేల వరకు పలుకుతోంది. గతేడాది ఇదే విగ్రహం రూ.32వేలకే విక్రయించారు. వినాయక చవితికి నాలుగు నెలలు ముందుగానే జిల్లాకు రాజస్థాన్ నుంచి సుమారు 1500 మంది కుటుంబాలు వలస వస్తుంటాయి.అంత దూరం నుంచి వచ్చి నెలల తరబడి పని చేసినా గిట్టుబాటు కావడంలేదని వారు ఆందోళన చెందుతున్నారు.
* తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు, నిడదవోలు, భీమవరం, నరసాపురం భీమడోలు ప్రాంతాలకు వలస వచ్చినవారు క్యాంపులుగా విడిపోతారు. వీరికి 200 భారీ విగ్రహాలు తయారీకి అనుమతివస్తే కానీ గిట్టుబాటు కాదు. ప్రస్తుతం 100 నుంచి 150లోపే విగ్రహాల తయారీకి ఆర్డర్లు వస్తున్నాయి. కరోనా నుంచి తమ ఉపాధికి గండిపడిందని వారు తెలిపారు.
* ఈ ఏడాది మొత్తం మట్టితోనే వినాయక విగ్రహాలు తయారు చేయాలని మొదట కేంద్రం నిర్ణయించినా.. ఆఖరి నిమిషంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కూడా తయారు చేసుకోవచ్చునని అనుమతి ఇచ్చారు. అయితే నిబంధనలను కఠినతరం చేశారని తయారీదారులు అంటున్నారు. జూన్ నెలాఖరు వరకూ అనుమతి ఇవ్వ లేదు. నీటిలో తేలికగా కరిగే రంగులకు సైతం ధరలు పెంచారు.
ఇదే ఆధారం : ‘మా రాష్ట్రంలో అంతగా పనులు లేవు. తరతరాల నుంచి విగ్రహాలను తయారు చేస్తున్నాం. జీఎస్టీ పేరుతో భారీగా ముడి సరకుల ధరలను పెంచారు. దీంతో విక్రయాలకు ఇబ్బంది కలుగుతోంది. ప్రస్తుతం వీటి ద్వారా ఏం మిగిలే పరిస్థితి లేదు’ అని రాజస్థానీ కళాకారుడు నింబారాం వాపోయారు.




