తెలంగాణముఖ్యాoశాలు
శఠగోపాన్ని తలపై పెట్టుకున్న ఈవో…… అపచారం జరిగిందని సంప్రోక్షణ

భద్రాచలం రామాలయం రాజగోపురం ఎదుట ఉండే ఆంజనేయస్వామి ఆలయంలో ఈవో శఠగోపం తలపై పెట్టుకున్నారు. ఇతరులు దాన్ని ముట్టుకోవడం అపచారమని పేర్కొంటూ అర్చకులు సంప్రోక్షణ చేసిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, పొదెం వీరయ్య, సీతక్క తదితరుల బృందం మంగళవారం భద్రాచలం రాముణ్ని దర్శించుకున్నారు. పూజల సమయంలో వీరికి శఠగోపం పెట్టారు. ఇది శిరస్సుకు తాకకుండా పెట్టారని, ఆలయ సిబ్బంది తమను సరిగా పట్టించుకోలేదని వారు నిరసన తెలిపారు. అధికార పార్టీ నాయకులు వస్తే ఇలాగే చేస్తారా? అని ప్రశ్నించారు. అనంతరం సదరు వైదిక ఉద్యోగిని పిలిపించి ఎందుకిలా చేశారని అధికారులు వివరాలు సేకరించారు. వ్యక్తిగత కారణాలతో కొంతమంది సీనియర్ వైదిక సిబ్బంది సెలవులో ఉండడంతో తాను ఆశీర్వచనం పూజలో ఉండాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. నిబంధనల ప్రకారమే తాను పూజ చేశానని సమాధానం ఇచ్చారు.
) బుధవారం ఈవో దర్శనానికి వచ్చే సరికి ఆంజనేయస్వామి ఆలయంలో ముఖ్య అర్చకుడు ఉన్నారు. హారతి పల్లెంలో ఉన్న శఠారి(శఠగోపం)ని తీసుకుని ఇలా దీవించాలని దాన్ని తలపై పెట్టుకున్నారు. అక్కడ ఉన్న అర్చకుడితో ఆగ్రహంగా మాట్లాడారు. ఈవో చేతులతో దీన్ని పట్టుకొని తనకు తానే దీవించుకోవడాన్ని అపచారంగా పేర్కొన్నారు. మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కావడంతో వైదిక పెద్దలు దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఆలయ తలుపులు మూసి తాళం వేశారు. శఠగోపాన్ని ప్రత్యేక పల్లకీలో తీసుకెళ్లి యాగశాలలో సంప్రోక్షణ చేశారు. దోష నివారణకు శుద్ధిపూజ తర్వాత దర్శనాలకు అవకాశం కల్పించారు. ‘భక్తులు సంతోషపడేలా దీన్ని తలపై ఉంచాలని చెప్పడం కోసమే పట్టుకున్నానని, ఇది కావాలని చేసింది కాదని’ ఈవో తెలిపారు.
| |




