తమపార్టీ కేంద్ర మంత్రి వర్గంలో చేరేందుకు ఆహ్వానమిస్తున్న

ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ తమపార్టీ కేంద్ర మంత్రి వర్గంలో చేరేందుకు తమకు ఆహ్వానం ఉందని, ఈ విషయం తమ పార్టీ పరిశీలనలో ఉందని ప్రకటించడం వెనుక జగన్ హస్తం ఉందని రాజకీయ నిపుణులు చెపుతున్నారు. రాజధాని అమరావతి విషయంలో, అన్నా క్యాంటిన్ల మూసివేత, రివర్స్ టెండరింగ్ ఇలా ఏది చూసినా ముందుగా బొత్సతోనో మరో మంత్రితోనూ లీకులు ఇవ్వటం జగన్కి కొత్తేమీ కాదని, తను అనుకున్నది ముందుగా మీడియాకు లీకులివ్వడం, ఆపై జనం చర్చించుకునేలా చేయటం, తదుపరి సాకులు చూపడం , చివరకి అమలు చేయటం చేస్తుంటారని, ఇదంతా వైసిపి ఆడే మైండ్గేమ్లో భాగమన్న వాదనలు ఇప్పుడు బలంగా వినినిస్తున్నాయి.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారుస్తున్న వైసిపితో తాము పొత్తులు పెట్టుకోబోమంటూ ఏపి బిజెపి రాష్ట్ర పరిశీలకుడు చెప్పినా, అలాంటి సమాచారం తనకు లేదని ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్గానీ, అటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గానీ తేల్చి చెపుతున్నా, వైసిపి వర్గాలు మాత్రం కేంద్ర మంత్రి వర్గంలో చేరటం ఖాయమన్న ప్రచారానికి బలమైన పునాదులే వేస్తున్నాయి.
స్థానిక ఎన్నికల అనంతరం వైసిపి కేంద్ర ప్రభుత్వంలో, ఎన్డిఏ కూటమిలో చేరే అవకాశాలున్నాయని ఆ పార్టీ సీనియర్లు చెపుతున్న మాట. తన పార్టీ బలం ఆధారంగా కనీసం 2-4 మంత్రి పదవులు అందుకునే అవకాశం ఉందని, ఏపి కి అధిక ప్రాధాన్యత దక్కటం ద్వారా నిధులు రాబట్టుకోవచ్చని ఓ సీనియర్ సభ్యుడు చెప్పడం గమనార్హం.
గత ఎన్నికలలో వైసిపికి మద్దతు ఇచ్చిన ముస్లిం వర్గాలు ఇప్పటికే పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానించకుండా జగన్ ద్వంద వైఖరి అవలంబించడాన్ని తప్పు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి కూటమిలో చేరితే ఆ వర్గం దూరమయ్యే ప్రమాదం ఉంది. అయితే ఈ అంశాన్ని వైసిపి నేత వరకు కొట్టి పారేసారు. స్ధానిక ఎన్నికలు పూర్తయితే, మరి నాలుగేళ్లవరకు జనం నుంచి ఓట్లు అడిగే పని ఉండదని, మళ్లీ ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితి బట్టి వ్యవహరించవచ్చని చెపుతున్నారు. కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే మంత్రి వర్గంలో చేరుతున్నామని చెపుతున్న నేతలూ మరికొందరుండటం గమనార్హం.
అయితే విజయసాయిరెడ్డి పార్టీల నడుమ వారధిగా పనిచేసే వరకు ఒకే కానీ, జగన్తో పలు కేసులలో ఏ2 ముద్దాయిగా ఉన్నఆతనికి మంత్రి వర్గంలో స్థానం ఇచ్చేందుకు ప్రధాని అంగీకరిస్తారా? అన్న చర్చ కూడా ఇప్పుడు ప్రధానంగా వైసిపిలో జరుగుతోంది. మార్చి 15 తదుపరి తెలవటం ఖాయమని, వైసిపి నేతలు చెపుతున్నట్టు అప్పటికి స్ధానిక ఎన్నికలు పూర్తవుతాయని రాజకీయ పరిశీలకులు చెపుతున్న మాట. మరి ఏం జరగనుందో చూడాలి.




