చెక్కులు చెల్లక తెలంగాణ ఇజ్జత్ పోయింది……బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్

* పేద రైతులకు ధరణిని మరణ శాసనం
* ప్రభుత్వ భూములు కొల్లగొట్టేందుకే ధరణి పోర్టల్ * అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం
పంజాబ్ లో మరణించిన రైతు కుటుంబాలకు మూడు లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పక్షాన కెసిఆర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవడంతో దేశవ్యాప్తంగా తెలంగాణ ఇజ్జత్ పోయిందని బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులను విస్మరించి పంజాబ్ రైతులకు చెక్కులు పంపిణీ చేస్తూ సొంత రాజకీయ ప్రయోజనం కోసం వికృత క్రీడా ఆడి తెలంగాణ పరువు తీసాడని మండిపడ్డారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబకంటి లో ప్రారంభించి బామినీ, నందన్ గ్రామాల మీదుగా నిర్మల్ నియోజకవర్గం లోని నర్సాపూర్ జి వద్ద ప్రవేశించింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సొంత రాష్ట్ర రైతుల సమస్యలు పక్కన పెట్టి ఇతర రాష్ట్రాల రైతులను ఉద్ధరిస్తానని దేశం తిరుగుతున్న కేసిఆర్ అక్కడి రైతులకు ఇచ్చిన చెక్కులు చెల్లకపోతే ఎవరి పరువు పోతుందని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన నిర్వాకం తెలంగాణ ఇజ్జత్ తీయడంతో పాటు పంజాబ్ రైతులను అవమానించినట్లేనని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకువచ్చిన ధరణి కార్యక్రమం తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనం అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధువుల కోసమే దీన్ని తీసుకువచ్చారని ఫైర్ అయ్యారు. ధరణి వల్ల అనేక పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ తో వేలాది రెవెన్యూ రికార్డులు తారుమారై రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేస్తామని ప్రకటించారు. నష్టపోయిన రైతుల సమాచారాన్ని పక్కాగా సేకరించి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ అసైన్డ్ భూములను కొల్లగొట్టడానికి కేసిఆర్ ధరణి పోర్టల్ తెచ్చారని వెల్లడించారు అధికార పార్టీ నేతలు , అధికారులకు ధరణి ఒక వరంలా మారిందని తెలిపారు. తెలంగాణలో బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీడీ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు జీవన భృతి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీడీ పరిశ్రమకు జవసత్వాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. వేలాది మంది రైతులు, మహిళలు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.



