
దేశీయంగా జనంలో ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తునే, వారికి ఆరోగ్య పరంగా పూర్తి భరోసా ఇచ్చేందుకు కేంద్రం రంగం సిద్దం చేసిందని కేంద్ర మంత్రి నిర్మల చెప్పారు. శనివారం ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు కేటాయించినట్టు ప్రకటించారు. దీనితో పాటు మంచినీటి వల్ల వస్తున్న రోగాలను నిలవరించేందుకు వీలుగా పనిచేసే జల్ జీవన్ మిషన్కు రూ.3.06లక్షల కోట్లు కేటాయించామన్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందని ప్రధాని మోడీ ఆరంభించిన స్వచ్ఛ భారత్ దేశ వ్యాప్తంగా స్పందన అద్భుతంగా ఉందని ఈ మిషన్ మరింత మెరుగ్గా పనిచేసేందుకు రూ.12,300 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ప్రజల జీవన విధానంలో వస్తున్న మార్పుల కారణంగా అనేక రోగాలు కొత్తగా పుట్టుకువస్తున్నాయని, ఈ రోగాల నివారణకు నూతన పథకం తీసుకువస్తామన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా జీవ ఔషధి కేంద్రాల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని, మిషన్ ఇంద్రధనుష్ పథకం మరింతగా విస్తరణకు చర్యలు చేపడతామన్నారు.
2025కల్లా క్షయ నిర్మూలన దిశగా వేస్తున్న అడుగులు ఫలిస్తున్నాయని, ఆరోగ్య రంగంపై మరింత దృష్టి సారించడంలో భాగంగా పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు…



