ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ హీరోగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ‘యథా రాజా తధా ప్రజా’ సినిమా ప్రారంభం

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కథానాయకుడిగా ‘యథా రాజా తధా ప్రజా’ సినిమా పూజా కార్యక్రమాలతో పార్రంభం అయ్యింది. ఇందులో ‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ మరో హీరో. శ్రష్టి వర్మ కథానాయిక. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ విట్టల దర్శకత్వంలో ఓం మూవీ క్రియేషన్స్, శ్రీ కృష్ణ మూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్ నిర్మాతలు.
ముహూర్తపు సన్నివేశానికి హీరో శర్వానంద్ క్లాప్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకులు కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శక – నిర్మాత శ్రీనివాస్ విట్టల మాట్లాడుతూ ”హరీష్ పటేల్తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నాను. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నాను. కథ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరికి అయితే బావుంటుందని ఆలోచిస్తున్న క్రమంలో జానీ గారితో పరిచయం ఏర్పడింది. అప్పటికి ఆయన కథలు వింటున్నారు. నేను 20 నిమిషాల్లో కథ చెప్పగా… కీలక అంశం నచ్చి ఓకే చేశారు. రాజకీయ వార్తలు అంటే గతంలో పది నిముషాలు టీవీల్లో చూపించేవారు. ఇప్పుడు 24/7 రాజకీయ వార్తలు వస్తున్నాయి. రాజకీయాలు అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తి కలిగించే అంశం అయ్యింది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వినోదాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నాం. ఇందులో సందేశంతో పాటి వాణిజ్య హంగులు అన్నీ ఉన్నాయి. సెప్టెంబర్ 15 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. మూడు షెడ్యూళ్లలో సినిమా పూర్తి చేయాలనుకుంటున్నాం. సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. రధన్ గారు అద్భుతమైన బాణీలు అందించారు. బ్లాక్ బస్టర్ ఆల్బమ్ వస్తుంది” అని అన్నారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ ”చిరంజీవి గారి పుట్టినరోజున మా సినిమా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా విషయానికి వస్తే… శ్రీనివాస్ గారు చెప్పిన కథ వినగానే నచ్చింది. జానీ మాస్టర్ అంటే డ్యాన్స్, కమర్షియల్ అంశాలు కాకుండా మంచి కథతో వస్తే బావుంటుందని నిర్ణయం తీసుకున్నాను. ‘సినిమా బండి’ చూశా. వికాస్ బాగా చేశారు. ఆయనతో నటించడం సంతోషంగా ఉంది. ‘యథా రాజా తధా ప్రజా’ టైటిల్ ఐడియా మాకు ఇచ్చింది రైటర్ నరేష్ గారు. ఆయనకు థాంక్స్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నాం మా సినిమాకు పని చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా థాంక్స్. నన్ను, మా చిత్ర బృందాన్ని ఆశీర్వదించటానికి వచ్చిన శర్వానంద్ గారు, ఆయుష్ వర్మ గారికి థాంక్స్. నిన్నే ఆయుష్ శర్మతో ఒక సాంగ్ కంప్లీట్ చేశాం” అని అన్నారు.




