వైసీపీలో వర్గ పోరు

ఆమదాలవలస నియోజకవర్గం వైసీపీలో వర్గాల పోరు మరోసారి బయటపడింది. తమ ప్రతిపాదనతోనే ముఖ్యమంత్రి కళాశాలల మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని పొందూరుకు చెందిన వైసీపీ నాయకుడు చెప్పుకుంటుండగా.. స్పీకర్ను కాదని మీరిలా చేయడం తగదని మరికొందరు హితవు పలుతుకున్నారు. ఆమదాలవలస, పొందూరు జూనియర్ కళాశాలను ప్రభుత్వం బాలికల కళాశాలలగా మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెల్సిందే. దీన్ని విపక్షాలు, విద్యార్థి, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గి ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. పొందూరు కళాశాల మార్పు తన వల్లే ఆగిందని వైసీపీ నాయకుడు సువ్వారి గాంధీ నాలుగు రోజుల క్రితం పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆమదాలవలసలోని స్పీకర్ క్యాంపు కార్యాలయం వద్ద మున్సిపల్ మాజీ ప్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ తదితరులు విలేకరుల పెట్టి దీన్ని తీవ్రంగా ఖండించారు. కొంతమంది వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పార్టీ ప్లీనరీలో తమ్మినేని సీతారాం కళాశాల మార్పు విషయం ముఖ్యమంత్రి దృష్టికి తేవటంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. స్పీకర్ తమ్మినేని ఉండగా ఇంకొకరి ప్రతిపాదనలు అవసరం ఎందుకని ప్రశ్నించారు.




