తెలంగాణ
మంజీరాకు పోటెత్తిన వరద….. నీరు

మంజీరా కు వరద నీరు పోటెత్తింది. బోధన్ మండలం సాలూరా దగ్గర వంతెన
పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మహారాష్ట్ర- తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన ప్రాజెక్టుల్లోకి వరద నీరు పోటెత్తుతోంది
. ప్రాజెక్టులతో పాటు మంజీరా నది ఆయా మండలాల్లోని వాగులు, వంకల్లోనూ వరద నీరు ఉధృతంగా
ప్రవహిస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకోవడంతో 14 వరద గేట్లను ఎత్తి దిగువకు
నీటిని విడుదల చేస్తున్నారు. కౌలాస్నాలా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండడంతో గేట్లు ఎత్తి నీటిని
విడుదల చేస్తుండడంతో మండలాల పరిధిలోని వాగుల్లో వరద పోటెత్తుతోంది. దీంతో పలు గ్రామాలకు
రాకపోకలు నిలిచిపోయాయి. పోచారం ప్రాజెక్టులోకి సైతం 29 వేల క్యూసెక్కుల భారీ ఇన్ఫ్లో వస్తుంది.
దీంతో ప్రాజెక్టు పైనుంచి భారీగా వరద వెళ్తుంది. కల్యాణి రిజర్వాయర్కు సైతం భారీగా వరద
వస్తుండడంతో గేట్లు మొరాయించాయి. జిల్లా వ్యాప్తంగా 58.6 మి.మీ వర్షం కురిసింది. అత్యధికంగా
రాజంపేటలో 121.0 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడం, వరదలు
పోటెత్తుతుండడంతో వేలాది ఎకరాల్లో మళ్లీ పంటలు మునిగిపోతుండడంతో రైతులు ఆందోళన
చెందుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల పరిధిలో 2వేల ఎకరాలకు పైగా వరి పంటలు నీట మునిగాయి




